భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వామి ముకుందానంద, రాష్ట్ర గవర్నర్ డాక్టరు హరిబాబు కంభంపాటి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి సూర్య వంశీ సూరజ్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తూ దేశంలో విశ్వ విద్యాలయాలు యువత తమ ప్రతిభను అభివృద్ధి చేసుకోవడంతో తమ కలలు, ఆకాంక్షలను సాకారం చేసుకోగలిగే వాతావరణాన్ని కల్పించాలని అన్నారు.
విలువలతో కూడిన భవిష్యత్ నాయకులను తయారు చేయడంలో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయం ఏర్పాటు ఒక ముఖ్యమైన ముందడుగు చర్యగా రాష్ట్ర గవర్నరు డాక్టరు హరి బాబు కంభంపాటి తెలిపారు. జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవం ఉన్నత విద్య, పరిశోధన, నైతిక నడవడిక నిర్మాణంలో ఒక ప్రపంచ స్థాయి విద్యా కేంద్రంగా రాష్ట్రానికి వన్నె తెచ్చే ఒక కొత్త ప్రయాణం అని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ఆనందం వ్యక్తం చేశారు.
జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయం విశిష్టత
జగద్గురు కృపాలు మహారాజ్ ఆధునిక యుగానికి చెందిన ఒక మార్గదర్శక సాధువు. ఆయన భారత దేశపు వేద జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని, ప్రేమ, భక్తి సందేశాన్ని ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చేశారు. ఆయన యొక్క అపారమైన పాండిత్యం, మానవతావాద తత్వం మరియు నిస్వార్థ సేవాభావం ప్రేరణతో ప్రతి పౌరునికి సామాజిక బాధ్యతతో పాటు ఆధ్యాత్మికతను ఈ సంస్థ బోధిస్తుంది.


