జయపురం: ఒక దుకాణం తాళాలు బద్దలుగొట్టి దొంగతనం చేసిన వ్యక్తిని జయపురం పట్టణ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. నిందితుడు జయపురం సమితి ఛొటాగుడ ప్రాంతానికి చెందిన కె.రబిరావుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జూన్ 20వ తేదీన గొడియమాలిగుడ వీధిలో అజిత్ కుమార్ సామంతరాయ్ దుకాణం తాళాలు పగులగొట్టి డబ్బుతో పాటు సామగ్రి దొంగిలించుకుపోయాడని వెల్లడించారు. దీంతో పట్టణ పోలీసుస్టేషన్లో బాధితుడు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, సీసీ ఫుటేజీ సాయంతో దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. సబ్ ఇన్స్పెక్టర్ కేపీసీహెచ్ మిశ్ర దర్యాప్తు జరిపి నిందితుడిని గుర్తించి మంగళవారం అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి దొంగిలించిన సామగ్రిని సీజ్ చేశారు. కాగా పోలీసుల విచారణలో అతడు గతంలో పోస్టాఫీసు ఎదురుగా ఉన్న ప్రభుత్వ క్వార్టర్లో కూడా దొంగతనం చేసినట్లు నిర్ధారించారు.


