భువనేశ్వర్: శ్రీ జగన్నాథుని రథ యాత్ర పకడ్బందీగా నిర్వహించాలని విభాగాల వారీగా అధికారులు, సిబ్బంది ఇతరేతర అనుబంధ యంత్రాంగం రాత్రింబవళ్లు నిర్విరామంగా శ్రమిస్తున్నారు. యాత్ర ఆద్యంతాలు సుఖాంతంగా కొనసాగించాలని సకల యంత్రాంగాలు భద్రత, రక్షణపు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నాయి. ప్రధానంగా పోలీసు, అగ్ని మాపక అనుబంధ వర్గాలు యుద్ధ ప్రాతిపదికన కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమ వారం ఉదయం రథ యాత్ర నిర్వహణ కసరత్తు నిర్వహించారు. ఈ సందర్భంగా యాత్రలో రథాలు లాగడం, కదలిక, నిరాటంకంగా గమ్యం చేరడం అంశాలపై దృష్టి సారించారు. రథాలకు రక్షణ మొదలుకొని వడివడిగా కదలడంతో తొక్కిసలాట వంటి ప్రమాదాల నివారణతో గమ్యం చేరే దిశలో సాధన నిర్వహించారు. ఈ సమగ్ర ప్రక్రియ రథ యాత్రని తలపింప జేసింది. రథ యాత్రకు ముందు అత్యవసర పరిస్థితుల్లో స్పందించే తీరు, జనసందోహ నియంత్రణ మరియు వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని పరీక్షించేందుకు ఒడిశా పోలీసులు పూరీలో సమగ్రమైన అభ్యాస విన్యాసం (మాక్ డ్రిల్) నిర్వహించారు. ఈ విన్యాసాల్లో 13,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు. భక్తులందరికీ సురక్షితమైన, ప్రశాంతమైన ఉత్సవ అనుభవాన్ని కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.


