రాయగడ: బీజేడీ గుడ్ బై చెప్పి బిజు స్వాభిమాన్ మంచ్ను ఏర్పాటు చేసిన రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి భాస్కరరావు ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటున్నారు. అందరి అభిమానంతోనే బీఎస్ఎం ఆవిర్భవించిందన్నారు. సోమవారం జిల్లాలోని అత్యంత మారుమూల ప్రాంతమైన చంద్రపూర్లో నిర్వహించిన భారీ సమావేశంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రానున్న పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో బిజు స్వాభిమాన్ మంచ్ తన ఉనికిని చాటుకునేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. అందుకు అందరి సహాయ, సహాకారాలు అవసరమన్నారు. 50 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఎన్నో పదవులను అలంకరించానన్నారు. బీజేడీకి గుడ్ బై చెప్పడంతో తన వెంట ఉన్నవారి కోసం తాను నిరంతరం పోరాడటంతోపాటు వారిని ఒక తాటిపై నడిపించాలన్న సదుద్దేశంతోనే బిజు స్వాభిమాన్ మంచ్ను ప్రారంభించానన్నారు. తనపై నమ్మకాన్ని ఉంచుకున్న అభిమానుల వెంట తాను ఉండేందుకు ఆవిర్భవించిన ఈ పార్టీ ద్వారా రానున్న ఎన్నికల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతామని ప్రకటించారు. బిజుపట్నాయక్ ఆశయాలకు అనుగుణంగా ఆవిర్భవించిన బిజు స్వాభిమాన్ మంచ్ ఇకపై ఎన్నికల రంగంలో కూడా దూసుకువెళుతుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ సమావేశాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల నుంచి అనూమ్యమైన స్పందన లభించడంతో బిజు స్వాభిమాన్ మంచ్ కార్యకలాపాలను విస్తరింపజేసేందుకు నడుం బిగించామన్నారు. జిల్లాలో గల 11 సమితుల్లో సమావేశాలను నిర్వహించేందుకు కార్యాచరణను సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే రాయగడ, కొలనార సమితుల్లో బిజు స్వాభిమాన్ మంచ్ సమావేళాలను నిర్వహించడం పూర్తయ్యిందన్నారు. మీరు నా వెంట ఉంటే నేను మీ రాజకీయ భవిష్యత్ను మార్చి వేస్తానని ప్రకటించారు. తనకు ఎటువంటి పదవులపై ఆశలేదని స్పష్టం చేశారు. తన జీవితాన్ని తనను నమ్ముకుని ఉన్న వారికి అంకితం చేస్తానని హామీ ఇచ్చారు.
సమాయత్తమవ్వాలి..
రాష్ట్ర మాజీ మంత్రి లాల్ బిహారి హిమిరిక మాట్లాడుతూ.. బిజు స్వాభిమాన్ మంచ్లో ప్రతీ కార్యకర్తకు సముచిత స్థానం కల్పించాలన్న ఉద్దేశంతోనే నెక్కంటి ఏర్పాటు చేశారన్నారు. అతని వెంటే తామంతా ఉంటామన్నారు. రానున్న ఎన్నికల్లో బీఎస్ఎం (బిజు స్వాభిమాన్ మంచ్) కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. తన ఉనికిని చాటుకునేందుకు నిర్విరామంగా కృషి చేస్తుందన్నారు. అందుకు అంతా సమాయత్తమవ్వాలని పిలపునిచ్చారు.
అందరి వాడిలా..
చంద్రపూర్లో జరిగిన సమావేశంలొ పాల్గొన్న మాజీ ఎంపి నెక్కంటి, మాజీ మంత్రి లాల్ బిహారి హిమిరికలు సమావేశానికి ముందు చంద్రపూర్ చేరేసరికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడ గల ఒక చిన్న టీ దుఖానంలో టీ తాగుతూ అందరినీ ఆకట్టుకున్నారు. అందరి వాడిలా తాను మీ వాడినేనని నిరూపించుకున్నారు. కార్యక్రమంలో బిజు స్వాభిమాన్ మంచ్ నాయకులు రాయగడ సమితి ఛైర్మన్ టున్ని హుయిక, వైస్ చైర్మన్ హరప్రసాద్, జిల్లా పరిషత్ సభ్యురాలు సంధ్యా పులక, దూడల శ్రీనివాస్, సామల్, అభిమానులు పెద్ద సంఖ్యలొ పాల్గొన్నారు.


