న్యూస్రీల్
ఆదివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2026
ఓటీడీసీ లాభంలో
భువనేశ్వర్: ఒడిశా పర్యాటక అభివృద్ధి సంస్థ ఓటీడీసీ 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం రూ. 1.17 కోట్ల లాభం వాటా చెల్లించింది. పర్యాటక శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా ఓటీడీసీ సీనియర్ అధికారుల సమక్షంలో మేనేజింగ్ డైరెక్టర్ దీపంకర్ మహా పాత్రో నుంచి లాభం వాటా చెక్కును అందుకున్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఓటీడీసీ పని తీరును ప్రశంసిస్తూ పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ, వృత్తిపరమైన నిర్వహణ, పర్యాటక మౌలిక సదుపాయాల బలోపేతం, సందర్శకుల అనుభవాలను మెరుగుదలతో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి దోహదపడటంలో ఓటీడీసీ కీలక పాత్ర పోషిస్తుందని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా సేవల పంపిణీని మెరుగుదల మరియు పర్యాటక సౌకర్యాల విస్తరణ రంగాల్లో ఓటీడీసీ చేస్తున్న ప్రయత్నాలను ఆమె అభినందించారు.
ఓటీడీసీ ప్రస్తుతం 14 పంథ్ నివాస్ హోటల్ యూనిట్లు, ప్రామాణిక ఒడియా వంటకాల రెస్టారెంట్లు, దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకు సేవలందించే విలాసవంతమైన పర్యాటక రవాణా సముదాయాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక మౌలిక సదుపాయాల ప్రణాళిక, అమలు, ఉన్నతీకరణ, నిర్వహణకు బాధ్యత వహించే ఒక ఎయిర్ టికెటింగ్ విభాగం, ఇంజినీరింగ్ విభాగాన్ని నడుపుతోంది.
మౌలిక సదుపాయాల ఉన్నతీకరణ, కార్యాచరణ సామర్థ్యం పటిష్టత, వైవిధ్యమైన పర్యాటక సేవలు, పంథ్ నివాస్ నెట్వర్క్ మరియు ఇతర కార్యాచరణ విభాగాల్లో మెరుగైన సేవలతో టర్నోవర్, లాభాలు పెంచే లక్ష్యంతో ఒడిశా పర్యాటక అభివద్ధి సంస్థ ప్రతిష్టాత్మకమైన 3 ఏళ్ళ ప్రణాళికతో రోడ్ మ్యాప్ను సిద్ధం చేసిందని అధికారులు తెలిపారు.


