● అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలన
మల్కన్గిరి: కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి, మల్కన్గిరి జిల్లా కేంద్ర ఇన్చార్జి అధికారి మహ్మద్ అహ్మద్ శనివారం మల్కన్గిరిలో పర్యటించారు . ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం జిల్లాస్థాయి అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఉదయం చిత్రకొండ సమితిలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అలాగే గిరిజనులు సాగు చేస్తున్న డ్రాగన్ఫ్రూట్ తోటలను పరిశీలించారు. గిరిరైతుల సంక్షేమానికి సహకరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలానే అంగన్వాడీ కేంద్రలను సందర్శించి విద్య, వైద్యం, మంచినీటి సౌకర్యం గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పల్లె నుంచి పంచాయతీల అభివృద్ధి మిషన్ కార్యక్రమం పురోగతిని తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్, జిల్లా అభివృద్ధి శాఖ అధికారి దశరధి, జిల్లా సబ్ కలెక్టర్ దూర్యోధన్ బోయి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


