కొరాపుట్: పదేళ్ల బాలిక అనారోగ్యంతో చనిపోయింది.. ఊరేమో అంత్యక్రియలు చేయాలంటే డబ్బులు అడుగుతోంది.. మరో చోటకు వెళ్దామంటే అంబులెన్స్ అద్దెకూ డబ్బుల్లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ బాలిక మృతదేహాన్ని బైక్పై పెట్టుకుని 12 కిలోమీటర్ల దూరం తరలించిన ఘటన ఉమ్మర్కోట్లో జరిగింది. ఉమ్మర్కోట్ సమీపంలో సన్న బరండి గ్రామంలో అనితా లోహర (10) అనే బాలిక తన బంధువుల ఇంటిలో అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందింది. ఆమె వైద్యం కోసమే సన్నబరండి వచ్చి దురదృష్టవశాత్తు కన్ను మూసింది. ఉమ్మర్కోట్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చి తుది శ్వాస విడిచింది. ఈ విషయం తెలిసి ఇతర బంధువులు వచ్చి ఆమె స్వస్థలం చికల్పోదర్ తీసుకొని వెళ్లడానికి ప్రయత్నం చేశారు. బాలిక మృతి చెందిన సన్న బరండి లో అంత్యక్రియలు చేయడానికి ప్రయత్నం చేస్తే గ్రామస్తులు అడ్డుకున్నారని బాలిక బంధువులు అరోపించారు. ఇతర గ్రామ ప్రజలు తమ గ్రామంలో అంత్య క్రియలు చేస్తే రూ.7000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆరోపించారు. అంత డబ్బులు ఇచ్చుకోలేక, అంబులెన్స్కి అద్దె చెల్లించలేక తాము బైక్ మీద తరలించామని బాలిక బంధువులు ప్రకటించారు. బాలిక మృతదేహాన్ని బైక్ మీద తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఈ ఘటన జరిగిన ప్రాంతం రాష్ట్ర విద్యా మంత్రి నిత్యానంద గొండో సొంత నియోజకవర్గం కావడంతో విమర్శలు వినిపించాయి.


