పర్లాకిమిడి: మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని వక్తలు అన్నారు. ఏబీవీపీ 78వ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకుని గుమ్మబ్లాక్ పద్మపూర్ వద్ద బినోదినీ ప్లస్ టు ఆర్ట్స్ కళాశాలలో మొక్కలను గురువారం నాటారు. కార్యక్రమంలో కళాశాల ప్రెసిడెంట్ మనోజ్ కుమార్ పట్నాయిక్, అధ్యాపకులు రబి పాణిగ్రాహి, కళాశాల ఆర్ట్స్ విభాగం అధ్యాపకులు బాలకృష్ణ జెన్నా, సామాజిక కార్యకర్త మనోజ్ దాస్, హరప్రియ, ఇందు, చండీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని మహిళా కళాశాలలోనూ ఏబీవీపీ ఆధ్వర్యంలో మొక్కలను నాటారు.
నేమ్ బోర్డులో తెలుగు తొలగింపు
రాయగడ: రాయగడ రైల్వేస్టేషన్లో స్టేషన్ పేరును సూచించే బోర్డు నుంచి తెలుగు భాషను తొలగించి, ప్రస్తుతం ఒడియా, ఇంగ్లిష్, హిందీ భాషలను మాత్రమే ప్రదర్శిస్తున్నారు. ఈ మార్పుపై స్థానికంగా ఇప్పటివరకు ఎటువంటి అధికారిక అభ్యంతరాలు అందలేదని రైల్వే అధికారులు తెలిపారు. తెలుగు తొలగింపుపై ప్రశ్నించగా ఇప్పటివరకు ప్రజల నుంచి లేదా ప్రజాప్రతినిధుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదని అధికారులు పేర్కొన్నారు. ఒకవేళ ఈ అంశంపై అభ్యంతరాలు లేదా వినతులు అందితే పరిస్థితిని పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్న రాయగడ జిల్లాలో గణనీయమైన సంఖ్యలో తెలుగు మాట్లాడే ప్రజలు నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయంపై తెలుగు సంఘాలు, ప్రజాప్రతినిధులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
నాటుసారా బట్టీలపై
విస్తృతంగా దాడులు
జయపురం: జయపురం సబ్ డివిజన్ కుంధ్రా సమితిలో ఎకై ్సజ్ సిబ్బంది పోలీసుల సహకారంతో నాటుసారా బట్టీలపై విస్తృతంగా దాడులు కొనసాగిస్తున్నారు. కొరాపుట్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కుంధ్ర సమితి ఎకై ్సజ్ అధికారులు, సిబ్బంది స్థానిక పోలీసుల సహకారంతో గురువారం వివిధ గ్రామాల్లోని బట్టీలపై దాడులు నిర్వహించి వేలాది లీటర్ల నాటుసారాతో పాటు, సారా వంటకానికి సిద్ధం చేసిన ఊటను ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. అలాగే బట్టీల్లో వంట సామగ్రి, సారా డ్రమ్ములను సీజ్ చేసినట్లు తెలిపారు.
యువకుని ఆత్మహత్య
రాయగడ: స్థానిక రామకృష్ణ నగర్లో నివసిస్తున్న థొపా సుందర్ కుమార్ (16) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటిలో ఎవరూ లేని సమయంలో అతని గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదని పోస్టుమార్టం నివేదిక అనంతరం వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలియజేశారు.


