రాయగడ: స్థానిక పితామహాల్లో గల సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో కొత్తగా చేరిన 11వ తరగతి విద్యార్థులకు వారి తల్లిదండ్రులతో కలిసి గురువారం ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సెంచూరియన్ విశ్వవిద్యాలయం ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ రాజేష్ కుమార్ పాడి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. క్రమశిక్షణ, నైతిక విలువలు, సమయపాలన, నిరంతర కృషి ఫలితమే విజయానికి మూల సూత్రాలన్నారు. ఆధునిక విద్యాలో కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రాధాన్యాన్ని వివరించి, దానిని సానుకూలంగా వినియోగించుకోవాలని సూచించారు. భవిష్యత్లో ఏఐ ఆధారిత కేరీర్ అవకాశాలు విస్తృతంగా అందుబాటులో ఉంటాయన్నారు. విద్యలోనే కాకుండా మంచి వ్యక్తిత్వాన్ని కూడా పెంపొందించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల నిబంధనలు, క్రమశిక్షణ, సీబీఎస్ఈ మార్గదర్శకాలు, హాజరు, బోధన, హోంవర్క్, అంతర్గత మూల్యాంకనం, పరీక్షల విధానం, తదితర విషయాలపై తల్లిదండ్రులకు సమగ్ర సమాచారం అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా సెంచూరియన్ స్కూల్ మోబైల్ యాప్ను పరిచయం చేశారు. ఈ యాప్ ద్వారా విద్యార్థుల రోజువారి హాజరు, తరగతి పనులు, పరీక్షల షెడ్యూల్, ఫలితాలు, నోటిఫికేషన్లు, పాఠశాలకు సంబంధించిన ముఖ్య సమాచారం తల్లిదండ్రులు ఇంటి నుంచే సులభంగా తెలుసుకునే వీలుంటుందని వివరించారు. ఈ ఆధునిక డిజిటల్ వ్యవస్థపై తల్లిదండ్రులు ప్రశంసలు కురిపించారు.


