రాయగడ: ఉపాధి కోసం పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి వెళ్లిన 15 ఏళ్ల బాలుడు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. నాలుగు రోజులు గడిచినా మృతదేహం స్వగ్రామానికి చేరకపొవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతుడు రాయగడ జిల్లా బేడ్పదర్ గ్రామానికి చెందిన కడు మాఝి కొడుకు కమలాలోచన్ మాఝిగా గుర్తించారు. నెల రొజుల క్రితం నిర్మాణ కార్మికుడిగా పని చేసేందుకు విశాఖ వెళ్లిన కమల్ ఈ నెల నాలుగో తేదీన ఓ ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న సమయంలొ షార్ట్ సర్క్యూట్ కారణంగా విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందాడు. అయితే ప్రమాదం జరిగి నాలుగు రోజులు గడిచినా బాలుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించకపొవడంతో కటుంబ సభ్యులు తీవ్ర వేదనలో ఉన్నారు. ఈ ఘటనపై స్థానిక నాయకులు, సామాజిక కార్యకర్తలు స్పందించి, మృతదేహాన్ని వెంటనే స్వగ్రామానికి తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కొరుతున్నారు. కార్మిక శాఖ అధికారి బిష్ణు నాయక్, అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ జిల్లా కార్యదర్శి సదన్ మాఝి, కాంగ్రెస్ నాయకుడు తుంబేశ్వర్ నాయక్ తదితరులు కలిసి మృతదేహాన్ని త్వరితగతిన స్వగ్రామానికి తీసుకురావాలని కార్మిక శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
విశాఖలో ఘటన
స్వగ్రామంలో విషాదం


