కొరాపుట్: మాజీ మంత్రి జాదవ మజ్జి జయంతి ఘనంగా జరిగింది. నబరంగ్పూర్ జిల్లా చందాహండిలో జాదవ మజ్జి విగ్రహానికి బీజేడీ కార్యకర్తలు నివాళులర్పించారు. మాజీ ముఖ్యమంత్రి బీజూ పట్నాయక్ హయంలో జాదవ మజ్జి పరిశ్రమల మంత్రిగా కొనసాగారు. మాజీ మంత్రి రమేష్ మజ్జి, మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ చంద్ర మజ్జి, తదితరులు పాల్గొన్నారు.
ఉచిత నేత్ర వైద్య శిబిరం
రాయగడ: స్థానిక రైతుల కాలనీలోని నవజీవన్ ట్రస్టు వ్యవస్ధాపకులు డాక్టర్ శ్రీధర్ ఆచార్యుల జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ట్రస్టు కార్యాలయం ప్రాంగణంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పితామహాల్లోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సౌజన్యంతొ నిర్వహించిన శిబిరంలో 170 మందికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. రాయగడ పరిసర ప్రాంతాలకు చెందిన వారు శిబిరంలొ పాల్గొన్నారు. ట్రస్టు నిర్వాహకురాలు ఎం.నళిని శిబిరాన్ని పర్యవేక్షించారు.
ప్రథమ చికిత్సపై అవగాహన
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా రెడ్క్రాస్ సొసైటీలో సోమవారం భారతీయ రెడ్ క్రాస్ సొసైటీ ఒడిశా రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన సమితి స్థాయి ఒక్కరోజు అవగహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మల్కన్గిరి, కలిమెల, పోడియా సమితుల కోసం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో పీఎం శ్రీప్రభుత్వ నోడల్ హైస్కూల్ మల్కన్గిరిలో శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సమితి విద్యా అధికారి మమతా సాయ్, ముఖ్య వక్తగా రంజాన్ కుమార్ స్వాయి హాజరయ్యారు. రెడ్క్రాస్ చరిత్ర, సీపీఆర్, ప్రథమ చికిత్స, విపత్తుల నిర్వహణ, రహదారి భద్రత తదితర అంశాలపై అవగహన కల్పించారు. నిరంజన్ మహరణ, మార్కండ్ దాస్, కార్తీక్ చంద్ర బెహరా, రెడ్ క్రాస్ సభ్యులు పాల్గొన్నారు.
తప్పిన పెను ప్రమాదం
పొందూరు: మండలంలోని వావిలపల్లిపేట కూడలి వద్ద మంగళవారం పెను ప్రమాదం తప్పింది. రాజాం వైపు నుంచి చిలకపాలెం వైపు వెళ్తున్న ఊకలారీ కూడలి వద్ద రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. కూడలి చిన్నది కావడంతో భారీ లారీ మలుపును దాటుతున్న సమయంలో అదుపుతప్పి తొలుత ఒరిగి నెమ్మదిగా రోడ్డుపై పడిపోయింది. ఆ సమయంలో రెండు వైపులా ప్రయాణిస్తున్న వాహనదారులు గమనించి, వారి వాహనాలను నెమ్మదిగా చేయడంతో ప్రమాదం బారిన పడకుండా తప్పించుకున్నారు. ఘటనలో లారీలో ఉన్న డైవర్, క్లీనర్కు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఊక లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో కిలోమీటరు కంటే ఎక్కువగా వాహనాలు నిలిచిపోయాయి. కళాశాల బస్సులు, స్కూలు బస్సులు, అంబులెన్సులు, ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ట్రాఫిక్లో చిక్కుకున్నాయి. సుమారు గంట సమయం పాటు వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. పొందూరు ఎస్ఐ సత్యనారాయణ రెండు క్రేన్లు తెప్పించి లారీని పక్కకు తీయించారు. దీంతో ట్రాఫిక్ క్లియర్ అయ్యింది.
మోడ్రన్ పెంటాథ్లెన్ లేజర్ రన్ ఎంపిక పోటీలు రేపు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా మోడ్రన్ పెంటాథ్లెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మోడ్రన్ ఫెంటాథ్లెన్ లేజర్ రన్ ఎంపిక పోటీలు గురువారం జరగనున్నాయని ఆ సంఘ ప్రధాన కార్యదర్శి పీవీజే కృష్ణంరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల వర్షం కారణంగా పోటీలను వాయిదా వేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాజాంలోని జీసీఎస్ఆర్ డిగ్రీ కళాశాల వేదికగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాస్థాయి ఎంపికలు ఉదయం 9 గంటలకు మొదలవుతాయని పేర్కొన్నారు. బాలబాలికలు తమ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుతో ఎంపికలకు హాజరవ్వాలని సూచించారు.


