రాయగడ: జిల్లాలోని అంబొదల పోలీస్స్టేషన్ పరిధి హటొ దైహికాల్ గ్రామంలో నివసిస్తున్న ఒక వ్యాపారి ఇంట్లోకి గుర్తు తెలియని దుండగులు చొరబడి కత్తులు, మరణాయుధాలతో బెదిరించి ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదు దోపిడీ చేసిన ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు, పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి ఆరుగురు గుర్తు తెలియని దుండగులు అజిత్ సాహుకార్ అనే వ్యాపారి ఇంటికి సంబంధించిన ఇనుప గ్రిల్ను కట్ చేసి లోపలకు వెళ్లారు. మాస్కులు, గ్లౌవ్స్ ధరించిన దుండగులను చూసిన అందరూ లేచి కేకలు పెట్టేందుకు ప్రయత్నించారు. ఈ తరుణంలో దుండగులు ఇంట్లో ఒకరి మెడపై కత్తి పెట్టి బెదిరించారు. అనంతరం ఇంట్లోని 20 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 లక్షల నగదును దోచుకున్నారు. కేసు నమోదు చేసిన ఐఐసీ కేశవ్షడంగి పరిసరాల్లో సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు.


