న్యూస్రీల్
శనివారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2026
భువనేశ్వర్: దేశ వ్యాప్తంగా వంట గ్యాస్ (ఎల్పీజీ) కొరత తాండవిస్తోంది. ఈ సంక్షోభం నుంచి వినియోగదారులకు ఊరట కలిగించేందుకు ప్రభుత్వం సమయోచిన సంస్కరణలతో ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలో పెట్రోలియం, సహజ వాయువు శాఖ కార్యదర్శి, కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి అధ్యక్షతన అన్ని రాష్ట్రాల ఆహార సరఫరా, వినియోగదారుల సంక్షేమ శాఖల ప్రధాన కార్యదర్శుల మధ్య శుక్రవారం వర్చువల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వంట గ్యాస్ లభ్యత, పంపిణీ క్రమబద్ధీకరణపై చర్చించారు. రాష్ట్రం నుంచి ఆహార సరఫరా, వినియోగదారుల సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ సింగ్, ఆ శాఖ సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
గ్యాసు బుకింగ్ వ్యవధి పెంపు
వంట గ్యాస్ సంక్షోభ పరిస్థితుల్లో పంపిణీ క్రమబద్ధీకరణ మార్గదర్శకాలు నిర్ధారించారు. ప్రధానంగా బ్లాక్ మార్కెటింగ్ను నివారణ పట్ల దృష్టి సారించారు. ఓటీపీ ద్వారా వంట గ్యాస్ బుకింగ్ మరియు డెలివరీపై దృష్టి సారించాలని ప్రత్యేకంగా ఆదేశించారు. వంట గ్యాస్ పంపిణీ క్రమబద్ధీకరణలో భాగంగా బుకింగ్ వ్యవధిని పొడిగించారు. తొలి దశలో గ్రామీణ ప్రాంతాల్లో బుకింగు మరియు డెలివరీ వ్యవధిని 45 రోజులకు పెంచారు.
వాణిజ్య గ్యాస్ పంపిణీ కుదింపు
ప్రస్తుత వంట గ్యాస్ సంక్షోభ పరిస్థితుల్లో వాణిజ్య వంట గ్యాస్ పంపిణీ కుదించారు. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా గతంలో ఉపయోగించిన వాణిజ్య వంట గ్యాస్ ప్రామాణికంగా 20 శాతానికి పంపిణీ పరిమితం చేశారు.
సర్వర్ రద్దీ
అధిక బుకింగ్ కారణంగా సర్వర్ వేగం మందగించింది. ఈ పరిస్థితి నివారణకు సర్వర్ వేగాన్ని పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గ్యాస్ పంపిణీ ప్రక్రియకు సంబంధించి అన్ని రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. బ్లాక్ మార్కెటింగ్పై నిఘా వేసేందుకు ప్రతి జిల్లా స్థాయిలో ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్లను నియమించారు. సాధారణ వినియోగం విషయమై వంట గ్యాస్ గురించి భయాందోళనలు చెందాల్సిందేమీ లేదని అధికారులు అభయం ఇచ్చారు.


