
కస్తూరి రంగన్ మృతికి గవర్నర్ సంతాపం
భువనేశ్వర్: భారత అంతరిక్ష ప్రయాణానికి రూపశిల్పి, దార్శనిక శాస్త్రవేత్త, ఇస్రో మాజీ చైర్మన్ పద్మ విభూషణ్ డాక్టర్ కె.కస్తూరి రంగన్ మరణవార్త విన్న రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పరిశోధన రంగంలో ఆయన చేసిన విశేష కృషి యువతకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని శ్రద్ధాంజలి ఘటించారు.
శ్రీజగన్నాథునికి మహాస్నానం
భువనేశ్వర్: పూరీ శ్రీమందిరం రత్న వేదికపై కొలువుదీరిన శ్రీజగన్నాథ స్వామివారికి శుక్రవారం అర్ధాంతరంగా మహా స్నానం చేయించారు. ప్రధాన ఆలయ ప్రాంగణం జయ, విజయ ద్వారం ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తి వాంతి చేసినట్లు దృష్టికి రావడంతో స్వామివారికి మహాబింబ స్నానం చేయించాల్సి రావడం గమనార్హం. ఈ సందర్భంగా శ్రీమందిరంలో భక్తులకు సర్వ దర్శనం తాత్కాలికంగా నిలిచిపోయింది.
యువతి ఆత్మహత్య
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా పోడియ సమితి సిమిలిబంచో పంచాయతీ ఎంవీ 61 గ్రామంలో శుక్రవారం ఓ 18 ఏళ్ల యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎంవీ 61 గ్రామానికి చెందిన రింకీ మండాల్ గ్రామానికి సమీపంలోని ఓ చెట్టుకు ఉరికి వేలాడుతూ శుక్రవారం ఉదయం స్థానికులకు కనిపించింది. దీంతో వారు పొడియా పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని కిందకు దించి గ్రామస్తులను విచారించారు. తండ్రిని చిన్నప్పుడే కోల్పోవడం, తల్లి చదువు మాన్పించడం, ఓ యువకుడితో ప్రేమ సజావుగా సాగకపోవడం వంటి కారణాలు ఈ అఘాయిత్యానికి ఉసిగొల్పి ఉంటాయని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఆరోగ్యకేంద్రానికి తరలించారు. అనూప్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
అవినీతి కాంట్రాక్టర్ అరెస్ట్
కొరాపుట్: అవినీతి కాంట్రాక్టర్ను విజిలెన్స్ విభాగం అరెస్ట్ చేసింది. నువాపడ జిల్లాలో 22 చెక్ డ్యామ్ల నిర్మాణంలో రూ..57 లక్షల నిధులను కాంట్రాక్టర్ లక్ష్మీధర రౌత్రాయ్ మళ్లించాడు. శుక్రవారం ఈ విషయం గమనించిన కొరాపుట్ విజిలెన్స్ విభాగం అతడిని అరెస్ట్ చేసి భవాని పట్న విజిలెన్స్ కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించింది.
అక్రమంగా తరలిస్తున్న తాబేళ్ల పట్టివేత
మల్కన్గిరి: జిల్లాలోని కలిమెల సమితి మోటు చెక్పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను అటవీ శాఖ అధికారులు గురువారం రాత్రి పట్టుకున్నారు. ముందుగా అక్రమ రవాణాపై ఫారెస్టర్ రస్మీరంజన్ స్వాయ్కు సమాచారం వచ్చింది. దీంతో మోటు రేంజర్ మురళి అనూగులియాతో చర్చించి వాహనాల తనిఖీలు చేపట్టారు. దీనిలో భాగంగా 13 బస్తాల్లో తరలిస్తున్న 473 తాబేళ్లను గుర్తించారు. వాహనంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు వాహనాన్ని వదిలి పరారయ్యారు. తాబేళ్లను ఎంవీ 79 గ్రామం వద్దనున్న అటవీ కార్యాలయానికి తరలించారు.

కస్తూరి రంగన్ మృతికి గవర్నర్ సంతాపం

కస్తూరి రంగన్ మృతికి గవర్నర్ సంతాపం

కస్తూరి రంగన్ మృతికి గవర్నర్ సంతాపం