
పరిమితి పెరిగిందోచ్
నరసన్నపేట: ఖరీఫ్, రబీల్లో పంటల వారీగా రైతులకు ఎంత మొత్తంలో రుణాలివ్వాలనే అంశంపై గరిష్ట రుణ పరిమితి (స్కేల్ఆఫ్ ఫైనాన్స్) ఖరారైంది. గత ఏడాది కంటే ఈ ఏడాది అన్ని పంటలకు రుణ పరిమితి 10 నుంచి 20 శాతం వరకు పెరిగింది. ఏటా వ్యవసాయ పెట్టుబడులు పెరుగుతుండటంతో బ్యాంకు రుణాల పరిమితిని కూడా పెంచుతున్నారు. దీంట్లో భాగంగా రానున్న ఖరీఫ్, రబీ సీజన్లకు గరిష్ట రుణపరిమితి నిర్ణయించారు. ఈ మేరకు బ్యాంకులకు ఆదేశాలు వచ్చాయి. దీంతో బ్యాంకుల్లో కొత్త రుణాల పంపిణీ, పాత రుణాలు రెన్యువల్స్ను బ్యాంకర్లు ప్రారంభించారు.
పంటల వారీగా రుణపరిమితి ఇలా..
వర్షాధారం, నీటి వసతి కింద ఉన్న పొలాలకు వేర్వేరుగా పరిమితిని నిర్ధారించారు. వరికి గత సంవత్సరంలో ఎకరాకు రూ.46 వేలు రుణం ఇవ్వగా, దీన్ని ఈ ఖరీఫ్కు రూ.52వేలు చేశారు. రబీలో అయితే రూ.55 వేలు, విత్తన వరికి అయితే రూ.55 వేలు ఇవ్వనున్నారు. అలాగే వేరు శనగకు వర్షాధారం అయితే ఎకరాకు రూ.38 వేలు, కాలువ కింద పొలాలు అయితే రూ.41 వేలు, పత్తికి రూ.51 వేలు, మొక్క జొన్నకు రూ.47 వేలు, మినుము పంటకు రూ.30 వేలు, పెసలకు రూ.24వేలు, ఆయిల్ పామ్కు రూ. 70 వేలు, పచ్చి మిరపకు రూ.1.10 లక్షలు, రెడ్ మిరపకు రూ. 1.75 లక్షలు, చెరుకుకు రూ.80 వేలు, హైబ్రీడ్ టమాటాకు రూ.78 వేలు, వంకాయకు రూ.54 వేలు, బెండకు రూ.36 వేలు, అరటి ఎకరాకు రూ.1.10 లక్షలు, కొబ్బరికి రూ.70 వేలు, గడ్డి సాగుకు రూ.36 వేలు, బంతి పూల సాగుకు రూ.55 వేలు, వాటర్ మిలన్కు రూ.54 వేలు ఇలా మొత్తం 110 పంటలకు రుణ పరమితిని నిర్ధారించారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
10 నుంచి 20 శాతం పెరిగిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్
వరికి రూ. 52 వేలు వరకు రుణానికి అవకాశం
మొక్కజొన్నకు రూ.47 వేలు
వేరు శనగకు రూ.41 వేలు
బ్యాంకుల్లో ప్రారంభమైన పంటరుణాల రెన్యువల్స్
బ్యాంకర్లకు సమాచారం ఇచ్చాం
పెరిగిన రుణపరిమితి వివరాలపై బ్యాంకులకు సమాచారం ఇచ్చాం. దీని ప్రకారం బ్యాంకర్లు రుణాలు రెన్యువల్ చేయడం, కొత్తవి ప్రాసెస్ చేయడం ప్రారంభించారు. ఈ ఏడాది మరింత విరివిగా బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వనున్నాం.
– సూర్యకిరణ్, ఎల్డీఎం

పరిమితి పెరిగిందోచ్