కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ.. బిక్కుబిక్కుమంటున్న మంత్రులు.. | - | Sakshi
Sakshi News home page

కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ.. బిక్కుబిక్కుమంటున్న మంత్రులు..

May 16 2023 9:04 AM | Updated on May 16 2023 9:06 AM

- - Sakshi

భువనేశ్వర్‌: ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ త్వర లో మంత్రిమండలి పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉంది. కేబినెట్‌ సభ్యుల పనితీరు సమీక్ష పట్ల ఆయ న గురిపెట్టారు. సమీక్ష నివేదిక ఆధారంగా కొందరి తొలగింపు, మరికొందరికి పదవులు కట్టబెట్టే అవకాశాల పట్ల చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల స్పీక ర్‌ విక్రమ కేశరిఅరూఖ్‌, మంత్రులు సమీర్‌ రంజనదాస్‌, శ్రీకాంతసాహు తమ పదవులకు రాజినామా చేశారు. ఈ ఏడాది జనవరి 27న ఆరోగ్య–కుటుంబ సంక్షేమశాఖ మంత్రి నవకిషోర్‌ దాస్‌ హత్య తరువాత మరోస్థానం ఖాళీ అయ్యింది.

ఈ లెక్కన నవీన్‌ కేబినెట్‌లో(స్పీకర్‌ పదవి మినహాయించుకుని) 3 స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిని భర్తీ చేయడంతో పనితీరు సమీక్ష ఆధారంగా తొలగింపులు, శాఖల మార్పు, చేర్పులతో కొత్త ముఖాలకు స్థానం కల్పించే దిశలో చర్చ రసవత్తరంగా సాగుతోంది. ఇద్దరు రాత్రులు రాజీనామా చేయడంతో ఆ పదవుల బాధ్య తలను రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగంమంత్రి ప్రమీల మల్లిక్‌కు అదనంగా కేటాయించా రు. స్పీకర్‌ అరూఖ్‌ కూడా రాజీనామా చేయగా.. వ్యక్తిగత కారణాలను సాకుగా చూపారు. మరోవైపు శ్రీకాంత సాహు, సమీర్‌ రంజనదాస్‌ బీజేడీ సంస్థాగత వ్యవహారాల్లో నిమగ్నమయ్యేందుకు రాజీనా మా చేసినట్లు పేర్కొన్నారు. వీరివురూ వివాదాలలో చిక్కుకున్నందున లోపాయికారంగా నిష్క్రమించేలా చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

గవర్నర్‌ రాక కోసం..
మంత్రిమండలి మార్పు చేర్పుల పట్ల ఊహాగానాలు ఊపందుకుంటున్న తరుణంలో గవర్నర్‌ ప్రొఫెసర్‌ గణేషీలాల్‌ రాష్ట్రంలో అందుబాటులో లేరు. ఆయన ప్రస్తుతం హర్యానాలో ఉన్నారు. మరోవైపు ఈ నెల లో మంత్రుల పనితీరు సమీక్ష కొలిక్కి రానుంది. ఈ నెల 22న గవర్నర్‌ తిరిగి రానున్నట్లు సమాచారం. ఆ సమయానికి మంత్రుల పని తీరు సమీక్ష ప్రక్రియ ఖరారైన మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం చేసే అవకాశం ఉంది.

అంతా ఆయన నిర్ణయమే..
ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కోరుకున్నప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. శాఖల పంపిణీపై ఆయన నిర్ణయం తీసుకుంటారని రెవె న్యూ విపత్తు నిర్వహణ శాఖామంత్రి ప్రమీలా మల్లిక్‌ విలేకర్లకు సోమవారం తెలిపారు. దీపాలి దాస్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన సందర్భంగా ఆమె మాట్లాడారు. 2024 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మంత్రిమండలిలో మహిళా ప్రాతినిధ్యం బలపరిచే అవకాశం ఉందన్నారు. త్వరలో జరగనున్న పునర్వ్యవస్థీకరణలో సరికొత్త ముఖం ఝార్సుగుడ నియోజకవర్గ ఎమ్మెల్యే దీపాలీ దాస్‌, కవిసూర్యనగర్‌ ఎమ్మెల్యే లతిక ప్రధాన్‌కు పదవులు వరించే అవకాశాల పట్ల సంకేతాలు జారీ చేశారు. శాసనసభలో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో నిర్ణయం తీసుకునే ప్రక్రియలో మహిళలకు సముచిత స్థానం కల్పించాలని పార్టీ అధిష్టానం దీర్ఘకాలంగా యోచిస్తోంది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ కల్పించి, బిజూ జనతాదళ్‌ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌ వాగ్దానానికి పట్టంగట్టారు. పార్లమెంట్‌, అసెంబ్లీలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంలో విముఖతపై కేంద్రప్రభుత్వం ఆది నుంచి వెనుకడుగు వేస్తోందని ఆమె వ్యాఖ్యానించారు.

మహిళల ఆదరణ అపురూపం..
2001లో మహిళల ఆధ్వర్యంలో స్వయం సహాయక బృందాల్ని మిషన్‌శక్తి కార్యక్రమం కింద ఒక తాటిపైకి తీసుకుని వచ్చిన సీఎం నవీన్‌.. వరుసగా ఘన విజయాలు సాధిస్తున్నారు. మహిళల ఏకీకృతం సూత్రంతో బీజేడీ దేదీప్యంగా వెలుగొందుతుంది. నవీన్‌ పట్నాయక్‌ విజయంలో రాష్ట్ర మహిళల ఓట్లు వాటా అధికం కావడమేనని ఈ సందర్భంగా ప్రమీ లా మల్లిక్‌ అభిప్రాయం వ్యక్తంచేశారు. శనివారం విడుదలైన ఝార్సుగుడ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితాలు వెల్లడై, పార్టీ అభ్యర్థి తిరుగులేని విజయం సాధించడంతో మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణ వైపు ముఖ్యమంత్రి దృష్టి మల్లించారు. స్పీకర్‌ రాజీనామాతో ఆయనకు మంత్రివర్గంలో స్థానం లభించడం పట్ల ఊహాగానాలకు ఆజ్యం పోసింది.

బిక్కుబిక్కుమంటున్న మంత్రులు..
కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ పురస్కరించుకుని సిట్టింగ్‌ మంత్రులు బిక్కుబిక్కుమంటున్నారు. గత ఏడాది జూన్‌లో చేపట్టిన మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణ సందర్భంగా మొత్తం 20మంది మంత్రులతో రాజీనామా చేయించారు. అనంతరం భారీ మార్పు చేర్పులతో పునర్వ్యవస్థీకరించారు. ఆ సమయంలో వివాదాల్లో చిక్కుకున్న వారిని మంత్రి మండలి నుంచి తొలగించారు. ఈ జాబితాలో కెప్టెన్‌ దివ్యశంకర్‌ మిశ్రా, డాక్టరు అరుణ్‌కుమార్‌ సాహు, ప్రతాప్‌ జెనాలను మంత్రివర్గం నుండి తొలగింపు వేటుకు గురయ్యారు. ఈసారి ఎవరి పట్ల ఎటువంటి చర్యలు ఉంటాయోననే భయంతో మంత్రి మండలిలో సర్వత్రా భయాందోళనలు విస్తరించి ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement