రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ కోస్తా రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ (పీసీఓఎం) వినీత్ కుమార్ శనివారం కృష్ణపట్నం పోర్టుతో పాటు కీలక రైల్వే స్టేషన్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తొలుత పోర్టులో మౌలిక సదుపాయాలు, భద్రతా చర్యలు, సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచే వ్యూహాలపై ఆదాని కృష్ణపట్నం పోర్టు లిమిటెడ్ సీఈఓ జగదీష్ పటేల్తో సమీక్షించారు. సరుకు రవాణా సమర్థ్యాన్ని పెంచే లక్ష్యంగా ఉమ్మడి అభివృద్ధి కార్యాచరణపై చర్చలు జరిపారు. ఇటీవల చేపట్టిన ఆధునికీకరణ పనుల్లో భాగంగా పోర్టు సైలో–లోడింగ్ సదుపాయాలను మెరుగుపర్చడం, అదనంగా ఫీడింగ్ కన్వెయర్ను జోడించడం ద్వారా రెండు సైలోలు ఏకకాలంలో పనిచేసే సామర్థ్యాన్ని పరిశీలించారు. ఒక్కొక్క నౌకలో లక్ష టన్నులకు పైగా సరుకు రవాణా చేసేందుకు ఏర్పాటు చేసిన అదనపు మెకనైజ్డ్ బెర్త్ను పరిశీలించారు. ఈ మౌలిక సదుపాయాలు, కార్యాచరణ మెరుగుదలతో గత ఆర్థిక సంవత్సరం సాధించిన 22.7 మిలియన్ టన్నులతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 25 మిలియన్ టన్నుల రవాణా లక్ష్యాన్ని అధిగమించేలా అధికారులతో చర్చలు జరిపారు. అనంతరం పోర్టు సమీపంలోని మనుబోలు, కృష్ణపట్నం, నిడుగుంటపాలెం, రావూర్ రైల్వేస్టేషన్లతో పాటు గూడ్స్ షెడ్లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. సరుకు రవాణా కార్యకలాపాల కోసం ఉన్న సౌకర్యాలు, పనుల పురోగతి, సరుకు రవాణ, నిర్వహణను మెరుగుపర్చేందుకు అక్కడి అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ తనిఖీల్లో పీసీఓఎంతో పాటు సినియర్ డీఓఎం ఎ.సురేష్రెడ్డి, డీసీఎం జి.మోహన కృష్ణ పాల్గొన్నారు.


