ఢిల్లీలో అవార్డు అందుకున్న వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర
పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరపాలక సంస్థకు మరో ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్లో భాగంగా నిర్వహించిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్–2026లో విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోని 60వ డివిజన్ జాతీయ స్థాయిలో బెస్ట్ పెర్ఫార్మింగ్ డివిజన్గా ద్వితీయ ర్యాంక్, రాష్ట్రస్థాయిలో 31వ డివిజన్ స్టేట్ బెస్ట్ పెర్ఫార్మింగ్ అవార్డ్ సాధించింది. ఈ మేరకు సోమవారం జాతీయ స్వచ్ఛ వాయు దివస్ సందర్భంగా న్యూఢిల్లీలోని పర్యావరణ భవన్లోని గంగా ఆడిటోరియంలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, రాష్ట్ర మంత్రి కృతి వర్థన్ సింగ్, కార్యదర్శి తన్మయ్ కుమార్ చేతుల మీదుగా విజయవాడ నగరపాలక సంస్థ ప్రతినిధులు 60వ డివిజన్కు సంబంధించిన జాతీయ స్థాయి బెస్ట్ పెర్ఫార్మింగ్ వార్డు అవార్డును స్వీకరించారు. రూ.30 లక్షల నగదు బహుమతి అందుకున్నారు. అలాగే 31వ డివిజన్కు రాష్ట్ర స్థాయి బెస్ట్ పెర్ఫార్మింగ్ వార్డు అవార్డుతో పాటు రూ.15 లక్షల నగదు బహుమతి అందుకున్నారు.


