మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యుత్ సంస్థల్లోని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు (ఏఈఈ) పోస్టులకు నిర్వహిస్తున్న పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పి.పుల్లారెడ్డి చెప్పారు. కానూరులోని సాఫ్ట్వేర్ సంస్థలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని, కొత్తపేటలోని పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు కల్పించిన మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లు, పరీక్ష నిర్వహణకు సంబంధించిన సౌకర్యాలను పరిశీలించి, అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ హనుమయ్య, ఇతర అధికారులు ఆయన వెంట ఉన్నారు.
పరీక్ష కేంద్రాలను పరిశీలించిన
ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి


