క్లుప్తంగా
వేకువ వెలుగు రేఖలు విచ్చుకోకముందే ఇంటికి చేరాలని.. బిడ్డను మనసారా గుండెకు హత్తుకోవాలని.. వాడి ముద్దుముద్దు మాటలతో మురిసిపోవాలనుకున్న తల్లి మురిపెం తీరలేదు.. దారికాచిన మృత్యువు ఆ చిన్నారికి తల్లిప్రేమను దూరం చేసింది. సౌదీ నుంచి వస్తున్న అన్న కన్నా ముందే అమ్మానాన్నల వద్దకు చేరాలని.. అన్నకు రాఖీ కట్టి అతని దీవెనలు అందుకోవాలనుకున్న చెల్లి ఆశ చీకటిలో కలిసిపోయింది. ఇంటర్వ్యూ బాగా జరిగిందని.. తాను కూడా సాఫ్ట్వేర్ ఇంజినీరును కాబోతున్నానని భర్తకు ఫోన్ చేసి చెప్పిన వివాహిత సంతోషాన్ని అంతలోనే మృత్యువు చిదిమేసింది. పిల్లలు బడికి వెళ్లక ముందే ఇంటికెళ్లి, వారి ముద్దూముచ్చట తీర్చాలనుకున్న ఆ తల్లి ప్రాణం ఇనుప వస్తువుల మధ్య నలిగిపోయింది. వెంటే ఉన్న భర్తను ఒంటరిని చేస్తూ అనంత వాయువుల్లో కలిసిపోయింది. అమ్మానాన్నను చూడాలని.. వారితో కలిసి పెళ్లికి వెళ్లి బంధుమిత్రులతో సరదాగా గడపాలనుకున్న కోరిక నెరవేరకుండానే యువకుడి ప్రాణం తిరిగిరాని లోకాలకు చేరుకుంది.. తమ్ముడికి రాఖీ కట్టేందుకు ఆఫీస్కు సెలవు పెట్టానని, ఉదయం ఆరు గంటలకల్లా ఇంటికి వస్తున్నానని చెప్పిన బిడ్డ కోసం తల్లిదండ్రులు ఎదురుచూశారు. ఏడు గంటలైనా ఇంటికి రాకపోవడం, ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో కంగారు పడ్డారు.. ఇంతలో టీవీలో బస్సు ప్రమాదం వార్త రావడం, మృతుల్లో తమ బిడ్డ పేరు ఉండటంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో 65వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన ఆరుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.


