న్యూస్రీల్
రైతుల పక్షాన పోరుబాట అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన సమన్వయకర్తల నిరాహార దీక్షలు నీటి విడుదల కోసం 10వ తేదీన ర్యాలీలు ప్రభుత్వం స్పందించకపోతే ప్రకాశం బ్యారేజీకి పాదయాత్ర
సాక్షి ప్రతినిధి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వం కృష్ణాడెల్టా రైతులను గాలికొదిలేసింది. ఎన్నడూ లేని విధంగా ఖరీఫ్ సాగు కోసం డెల్టాకు నీరు విడుదల చేసిన ప్రభుత్వం ఆ తరవాత మాట మార్చింది. వరికి నీరు ఇవ్వలేమని చేతులెత్తేసింది. వరి వద్దు పెసర, మినుము సాగుచేయాలంటూ ఉచిత సలహాలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ సాగునీటి కోసం పోరుబాట పట్టింది. గురువారం నుంచి మూడు రోజుల పాటు పార్టీ అవనిగడ్డ సమన్వయకర్త సింహాద్రి రమేష్, మచిలీపట్నం సమన్వయకర్త పేర్ని కిట్టు, పెడన సమన్వయకర్త ఉప్పాల రాము దీక్షలు చేయనున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే అవనిగడ్డ నుంచి విజ యవాడ ప్రకాశం బ్యారేజీ వరకు సింహాద్రి రమేష్బాబు పాదయాత్ర చేయనున్నారు. ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యం
తెలంగాణలో అన్ని లిఫ్ట్ స్కీంల నుంచి నీరు వాడుకుంటుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం కృష్ణాడెల్టాకు నీటి విషయంలో ప్రభుత్వం బాధ్యతరహితంగా వ్యవహరిస్తోందని రైతు సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం జూరాల నుంచి శ్రీశైలానికి రోజుకు సుమారు 22 టీఎంసీలకు పైగా నీరు వచ్చి చేరుతోంది. అయినా నీరు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. పట్టిసీమతో కృష్ణాడెల్టాను సస్యశ్యామలం చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ నీటిని తాగు అవసరాల కోసమే నని ప్రకటించడాన్ని రైతులు తప్పు పడుతున్నారు. అసలు కృష్ణాడెల్టాలో ఖరీఫ్లో వరి, చెరకు, ఆక్వా తప్ప మరే ఇతర పంటల సాగు సాధ్యం కాదు. వరి సాగు చెయ్యొద్దంటే 10.5 లక్షల ఎకరాల మాగాణిలో తీవ్ర సంక్షోభం తప్పదు. 1855లో బ్రిటీష్ పాలనలో విజయవాడ వద్ద కృష్ణా నదిపై ఆనకట్ట, 1957లో ప్రకాశం బ్యారేజీ నిర్మించిన నాటి నుంచి కృష్ణా డెల్టాలో వరి సాగు వద్దనడం ఇదే తొలిసారని నిపుణులు చెబుతున్నారు. పులిచింతలలో 29 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకూ వర్షాలు పడే అవకాశం ఉంది. మహారాష్ట్ర, కర్ణాటకలో కృష్ణా, భీమా పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మరో వైపు శ్రీశైలం జలాశయానికి వరద వస్తోంది. పట్టిసీమ, పులిచింతల నుంచి రోజుకు నాలుగువేల క్యూసెక్కుల నీరు ఇస్తే డెల్టా సాగుకు ఇబ్బంది ఉండదు. బుధవారం ప్రకాశం బ్యారేజికి 6,918 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. గతంలో నీరు తక్కువ ఉన్నా కాలువలకు నీరు వదిలారు. 2003లో 80 టీఎంసీలతో సాగు జరిగింది.
పునరాలోచన చేయాలి
ప్రకాశం బ్యారేజీ కింద కృష్ణా జిల్లాలో 6,79,500 ఎకరాలు, ఏలూరు జిల్లాలో 58,000 ఎకరాలు పశ్చిమ కృష్ణా డెల్టాలో 5,71,351 ఎకరాల ఆయ కట్టు ఉంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల 170 సంవత్సరాల చరిత్ర ఉన్న కృష్ణాడెల్టా ఆయకట్టు తొలిసారి ప్రమాదంలో పడింది. ఇప్పటికే డెల్టాలో 80 శాతం మంది కౌలు రైతులు పొలాలను దుక్కి దున్ని, నారుమడులు పోసుకున్నారు. కొంత మంది వెదసాగు చేపట్టారు. సాగునీరు లేనప్పుడు సబ్సిడీపై వరి విత్తనాలు ఎందుకిచ్చారు, యాప్లో యూరియా అంటూ హడావిడి ఎందుకు చేశారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్నారు.
నేటి నుంచి దీక్షలు
కృష్ణా జిల్లా రైతులకు సాగునీరందించాలని డిమాండ్ చేస్తూ అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన నియోజక వర్గాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు గురువారం నుంచి మూడు రోజుల పాటు దీక్షలు చేయనున్నారు. అవనిగడ్డ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు ఆధ్వర్యంలో పులిగడ్డలో ఒకరోజు దీక్ష, అనంతరం అవనిగడ్డలో ఆందోళ నలు చేసేందుకు సిద్ధమయ్యారు. మచిలీపట్నం సమన్వయకర్త పేర్ని కిట్టు ఆధ్వర్యంలో ఆరో తేదీన మంగినపూడి శివారు కొత్తపూడి చర్చి సెంటర్లో, 8వ తేదీన చిన్నాపురం శివారు నెలకుర్రు రోడ్డులో నిరాహార దీక్ష చేయనున్నారు. పెడన సమన్వయకర్త ఉప్పాల రాము ఆధ్వర్యంలో ఆరో తేదీన గూడూరు, ఏడున పెడన, 8న బంటుమిల్లి, 9వ తేదీన కృత్తివెన్నులో నిరాహార దీక్ష చేస్తారు. పదో తేదీన ఈ మూడు నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు, నిరసన ర్యాలీలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
వరి పంట సాగు చేయవద్దని రైతులకు స్పష్టం చేస్తున్న కలెక్టర్ బాలాజీ


