ఇప్పటి వరకూ ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలతో కొనసాగుతున్న జోన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమలులోభాగంగా కొత్తగా కలిసిన 2 జిల్లాలు ఎన్టీఆర్, కృష్ణా, వెస్ట్గోదావరి, ఏలూరు జిల్లాలతో జోన్–3 ఏర్పాటు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): వాణిజ్య పన్నుల శాఖలో ప్రభుత్వం చేపడుతున్న జోన్ల పునర్ వ్యవస్థీకరణ చర్యలు ఆ శాఖ ఉద్యోగుల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జోన్ల పరిధికి సంబంధించి మార్పులు చేపట్టింది. ఉమ్మడి కృష్ణాజిల్లాకు మాత్రమే పరిమితమై ఉన్న జోనల్ పరిధిని పెంచి ఇతర జిల్లాలను కలుపుతూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో ఉద్యోగులు అయోమయానికి గురవ్వటమే కాకుండా పలు కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.
జోనల్ వ్యవస్థగా ఉన్న ఉమ్మడి కృష్ణాజిల్లా
ఉమ్మడి కృష్ణాజిల్లా ఇప్పటి వరకూ విజయవాడ జోనల్ వ్యవస్థగా ఉంది. పశ్చిమ కృష్ణా నుంచి విజయవాడ పాతబస్తీ వరకూ డివిజన్–1 పరిధిలో ఉండేది. దీనిలో ఆరు సర్కిల్ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. పాతబస్తీ నుంచి బెంజిసర్కిల్, ఆటోనగర్ హద్దుగా డివిజన్–2 పరిధిలో మరో ఆరు సర్కిల్ కార్యాలయాలు ఉన్నాయి. ఆటోనగర్ నుంచి మచిలీ పట్నం, నూజివీడు వరకూ డివిజన్–3 కార్యాలయం పరిధిలో ఐదు సర్కిల్ కార్యాలయాలు పని చేస్తున్నాయి. ఈ 17 సర్కిల్ కార్యాలయాలను విజయవాడ నోడల్ కార్యాలయం పర్యవేక్షించేది.
ఇకపై నాలుగు జిల్లాలు జోన్–3గా మార్పు
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వాణిజ్యపన్నుల శాఖను ఆరు జోన్లు, రెండు మల్టీ జోన్లుగా విభజిస్తున్నారు. ఇప్పటి వరకూ ఎన్టీఆర్, కృష్ణాజిల్లాలకు పరిమితమై ఉన్న జోనల్ కార్యాలయ పరిధిని విసు్తృత పరిచారు. పక్కన ఉన్న ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపి జోన్–3 ఏర్పాటు చేశారు. తాజాగా నాలుగు జిల్లాలు ఐదు డివిజన్ కార్యాలయాలు ఈ జోన్–3 పరిధిలోకి వస్తాయి. జోన్–3 కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేస్తారని సమాచారం. జోన్ మార్పుతో ఉద్యోగులు గందరగోళానికి గురవుతు న్నారు. జోన్లలో కొత్త జిల్లాలను కలపడం, కార్యాలయాల మార్పులు తదితర అంశాలపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. జోన్ పరిధి, ఇతర ఆదేశాలు పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చి, వీటిపై పూర్తి స్థాయి అవగాహన కలిగేవరకు విధుల నిర్వహణలో అయోమయ పరిస్థితులు ఉంటాయని పలువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు. తాజాగా చేపట్టిన జోన్ మార్పు నేపధ్యంలో విజయవాడలో పని చేసే ఉద్యోగులు పశ్చిమ గోదావరి జిల్లా వరకూ బదిలీ అయ్యే అవకాశముంది. దీంతో తమ పరిధి పెరగటం, బదిలీలకు ఎక్కువ దూరం వెళ్లాల్సిన పరిస్థితులు రావటంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.


