రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం తదితర పుణ్యక్షేత్రాలతో ‘దివ్య దక్షిణ యాత్ర’ పేరుతో ప్రత్యేక భారత్ గౌరవ్ పర్యాటక రైలును నడపనున్నట్లు ఐఆర్సీటీసీ జేజీఎం సత్య కిషోర్ తెలిపారు. ఆదివారం విజయవాడ రైల్వేస్టేషన్లోని ఐఆర్సీటీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ యాత్రలో కాంచీపురంలోని కామాక్షి అమ్మవారి ఆలయం, ఏకాంబేశ్వర ఆలయం, శ్రీపరదరాజర్ పెరుమాళ్ ఆలయం, మహాబలిపురంలో తీర దేవాలయం, కృష్ణుని వెన్నముద్ద, రామేశ్వరంలో రామనాథస్వామి ఆలయం, మధురైలో మీనాక్షి అమ్మవారి ఆలయం, తిరుచిలో శ్రీరంగస్వామి ఆలయం, తంజావూరులో బృహదీశ్వర ఆలయం, తిరువణ్ణామలైలో అరుణాచలం ఆలయం సందర్శన ఉంటుందన్నారు. ఈ నెల 27 నుంచి మే 4 వరకు సాగే ఈ యాత్రలో రైలు విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది. తుని, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో బోర్డింగ్/డీబోర్డింగ్ సదుపాయం ఉందని తెలిపారు. ఈ యాత్రలో ఆన్బోర్డు/ఆఫ్బోర్డులో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి శాఖాహార భోజనం, పర్యటక ప్రదేశాలను సందర్శించేందుకు రోడ్డు మార్గంలో రవాణా సదుపాయం, రాత్రిళ్లు హోటళ్లలో బస తదితర ఏర్పాట్లతో పాటు కోచ్లలో సీసీ కెమెరాలతో నిరంతరం భద్రత ఏర్పాట్లు, టూర్ ఎస్కర్ట్లు అందుబాటులో ఉంటారని తెలిపారు.
ప్యాకేజీ ధరలు..
స్లీపర్ క్లాస్ పెద్దలకు ఒక్కొక్కరికీ రూ. 14,700, పిల్లలకు రూ.13,800గా టిక్కెట్ ధర నిర్ణయించారు. ఆసక్తి కలిగిన వారు ఆర్ఆర్సీటీసీ వెబ్సైట్ లేదా విజయ వాడ రైల్వే రిటైనింగ్ రూమ్ వద్ద ఐఆర్సీటీసీ కార్యాలయంలో, లేదా 92814 95848, 92810 30714 ద్వారా టికెట్ బుక్ చేసుకోవాల్సిందిగా సూచించారు.
అరుణాచలం, కాంచీపురం,
మహాబలిపురం యాత్ర


