మచిలీపట్నంటౌన్: చెత్త రహిత స్వచ్ఛ మచిలీ పట్నంను తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ స్వచ్ఛ సైనికులుగా ముందుకు రావాలని కృష్ణాజిల్లా కలెక్టర్ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డీకే బాలాజీ పిలుపునిచ్చారు. నగరంలో కలెక్టర్ స్వచ్ఛత కార్య క్రమానికి ఆదివారం శ్రీకారం చుట్టారు. నూతనంగా రూపొందించిన స్వచ్ఛ ఆయుధంను చేతబూని నగరంలోని 16వ డివిజన్ ఐదు రోడ్ల సెంటర్ ప్రాంతంలో స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో భాగంగా చెత్తను, ప్లాస్టిక్ కవర్లను ఏరివేశారు. వారికి తోడుగా ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు, వసుధ జీవవైవిధ్య బృందం వలంటీర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్వచ్ఛ ఆయుధంతో చెత్త ఏరివేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ నగరంలోని ప్రజలు స్వచ్ఛ సైనికులుగా తరలివచ్చి ప్రతిరోజు ఉదయం ఒక అరగంట కేటాయించి చెత్తను ఏరివేస్తే వారి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవచ్చన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంట మునిసిపల్ సహాయ కమిషనర్ గోపాలరావు, వసుధ జీవవైవిధ్య బృందం సభ్యులు, పారిశుద్ధ్య సిబ్బంది, స్వచ్ఛ సర్వేక్షణ్, స్వర్ణ వార్డు సిబ్బంది పాల్గొన్నారు.


