● పోలీస్ కమిషనర్
ఎస్వీ రాజశేఖరబాబు
● ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో
స్పెషల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో జిల్లాలో క్రికెట్ బెట్టింగ్లపై ప్రత్యేక నిఘా పెట్టామని, బెట్టింగ్లకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా జరుగుతున్న బెట్టింగ్ కార్యకలాపాలు యువతను తప్పుదారి పట్టిస్తున్నాయన్నారు.
స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందం సభ్యులు వీరే!
క్రికెట్ బెట్టింగ్ను నియంత్రించేందుకు సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణప్రసన్న ఆధ్వర్యంలో ఏసీపీ (ఎస్బీ) భానుప్రకాష్రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ పవన్కుమార్, సౌత్ ఏసీపీ డాక్టర్ మానస, ట్రాఫిక్ ఏసీపీ వేదాతో స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసినట్టు సీపీ రాజశేఖరబాబు తెలిపారు. బెట్టింగ్లో పాల్గొన్నా, నిర్వహించినా, ప్రోత్సహించినా ఆంధ్రప్రదేశ్ జూద చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు, అరెస్టులు, సస్పెక్ట్ షీట్లు ఓపెన్, బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేస్తామని, డిజిటల్ పరికరాల స్వాధీనంతో పాటు భవిష్యత్తులో ఉద్యోగాలు, విదేశీ అవకాశాలు కోల్పోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో నిరంతరం తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. తల్లిదండ్రులకు తమ పిల్లలపై కచ్చితమైన పర్యవేక్షణ ఉంచాలని, యువత తమ భవిష్యత్తును కాపాడుకునేలా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు. ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు గమనించినా, ఆన్లైన్ ద్వారా జరిగినా వెంటనే 100/112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.


