● పచ్చనేతల డైరెక్షన్లో
వ్యవస్థీకృతంగా దోపిడీ
● పార్లమెంటు ముఖ్యనేత
కనుసన్నల్లో పనిచేస్తున్న అధికారులు
● ఫలానా వ్యక్తికే బియ్యం
ఇవ్వాలంటూ రేషన్ డీలర్లకు హుకుం
● ప్రతి నియోజక వర్గం నుంచి 500
టన్నుల బియ్యం మాఫియా చేతికి
● కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు
ఎగుమతి
● రేషన్ మాఫియా డాన్ వైపు కన్నెత్తిచూడని అఽధికారులు
దోపిడీకి కాదేదీ అనర్హం అన్నట్టు జిల్లాలో పచ్చనేతలు రేషన్ బియ్యాన్ని సైతం వదలడం లేదు. పేదలకు దక్కాల్సిన బియ్యాన్ని పందికొక్కుల్లా మెక్కేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో రేషన్ డాన్ పార్లమెంటు ముఖ్య నేతకు సన్నిహితంగా మెలుగుతూ విశృంఖలంగా రేషన్ బియ్యం దందా నిర్వహిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో రేషన్ బియ్యం దందా యథేచ్ఛగా సాగుతోంది. పార్ల మెంటు ముఖ్యనేత కనుసన్నల్లో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. ఈ రేషన్ బియ్యం మాఫియా వ్యవహారాన్ని సాక్షాత్తూ అధికార పార్టీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు బహి రంగంగా ప్రకటనలు చేసినా అధికారుల్లో మాత్రం చలనం లేదు. బియ్యం మాఫియాకు అడ్డుకట్ట పడలేదు. ఏకంగా జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల బియ్యాన్ని ఏకీకృతంగా ఒక వ్యక్తే సేకరించి, కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు తరలించి కోట్లు దండుకుంటున్నారు. ఈ దందా వ్యవహారంలో సింహభాగం పార్లమెంటు ముఖ్యనేత కనుసన్నల్లోనే సాగుతోంది. పౌరసరఫరాల అధికారులు, విజిలెన్స్ అధికారులను పావులుగా మార్చుకున్నారు. పార్లమెంటు ముఖ్యనేత డైరెక్షన్ మేరకు తాము చెప్పిన వ్యక్తికే, బియ్యం ఇచ్చేయాలని అధికారులు హుకుం జారీ చేస్తున్నారు. దాంతో ప్రతి నెలా మొదటి రెండు మూడు రోజుల్లోనే రేషన్ దుకాణాల్లో బియ్యం మాయమైపోతున్నాయి. దందాకు సహకరించని డీలర్లపై రేషన్ షాపులు తనిఖీ చేసి, షాపులు సీజ్ చేస్తున్నారు. పోలీసులు సైతం మామూళ్లు తీసుకుని ఈ దందాకు సహకరిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో సగటున 500 టన్నులకు పైగా రేషన్ బియ్యం మాఫియా చేతుల్లోకి పోతున్నాయి. రైస్ మిల్లుల్లో ఈ బియ్యాన్ని పాలిష్ చేసి, నేరుగా కాకినాడ పోర్టు మీదుగా విదేశాలకు తరలిస్తున్నారు. బియ్యం మాఫియా నుంచి పార్లమెంటు ముఖ్యనేతకు కోటి రూపాయలు, నియోజకవర్గాల ప్రజాప్రతినిధులకు రూ.25 లక్షల చొప్పున అందుతున్నట్టు సమా చారం.
ఇటీవల వీరులపాడులో 295 బస్తాల బియ్యం పట్టుకుని కేసులు నమోదు చేశారు. వీరులపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన కాజా సత్యనారాయణపై పీడీ యాక్టు అమలు చేశారు. ఇతనిపైన 41 కేసులు ఉన్నాయి. ఇలాంటి వ్యక్తి పట్ల కఠినంగా వ్యవహరించడం మంచిదే. అయితే ప్రస్తుతం రేషన్ మాఫియాలో కీలకంగా వ్యవహరిస్తున్న రామచంద్రరావుపైన ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే అతనిపైన పీడీ యాక్టు అమలు చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు నివేదించారు. అయినా ఇంకా అతనిపై పీడీ యాక్టు అమలు కాకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇతను పార్లమెంటు ముఖ్యనేత, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులతో పాటు, స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారులకు ముడుపులు ముట్టజెపుతుండటంతోనే అతడిని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని, దీంతో అతని ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోందని విమర్శలు వినవస్తున్నాయి. వాటాల్లో తేడాలు వచ్చి కొంత మంది మాఫియా సభ్యులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం ద్వారా ఇటీవల నామమాత్రంగా రేషన్ బియ్యం పట్టుకుంటున్నారు కాని, గతంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నా పౌరసరపరాల శాఖ అధికారులు పట్టించుకున్న దాఖలాలు మాత్రం కనిపించడంలేదు. ఇదంతా వారికి తెలిసే జరుగుతుందని, నామమాత్రపు దాడులతో మమ అనిపిస్తున్నారని పలువురు పెదవి విరుస్తున్నారు. రేషన్ మాఫియాకు, పచ్చనేతలకు లింకు ఉండటం వల్లే అధికారులు సైతం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో రేషన్ మాఫియా బరితెగించి పోలీసులపై సైతం దాడికి తెగబడుతున్నారు. గతంలో ఇటువంటి సంఘటన మైలవరం నియోజకవర్గంలో చోటు చేసుకుంది.


