గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం కింద జిల్లాలో ఈనెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ వరకు 8వ విడత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా నిర్వహించే గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పోస్టర్లను కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం కలెక్టరేట్లో పశుసంవర్థక శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమం ద్వారా జిల్లాలోని 1,93,050 పశువులకు టీకాలు వేయాలనే లక్ష్యంతో 34 బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ఒక్కో బృందంలో ఒక పశువైద్యుడు, ఒక పారా వెటర్నరీ సిబ్బంది, ఒక పశుసంవర్ధక సహాయకుడు ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యాధి లక్షణాలు, వ్యాధి వల్ల కలిగే నష్టాలు, వ్యాధి నిరోధక టీకాల వల్ల కలిగే లాభాలను వివరించాలని సూచించారు. నాలుగు నెలల వయసు దాటిన ప్రతి ఆవు లేదా గేదె జాతి పశువులకు తప్పనిసరిగా టీకా వేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్థక అధికారి డాక్టర్ ఎం.హనుమంతరావు, అధికారులు పాల్గొన్నారు.
ప్రచార పోస్టర్లను ఆవిష్కరించిన
కలెక్టర్ లక్ష్మీశ


