వైభవంగా ముగిసిన వీరమ్మతల్లి తిరునాళ్ల
ఉయ్యూరు: కోరిన కోర్కెలు తీరుస్తూ ఉయ్యూరులో కొలువైన శ్రీకనక చింతయ్య సమేత వీరమ్మతల్లికి అశేష భక్తజనం విశేష పూజలు జరిపించారు. తిరునాళ్ల మహోత్సవం ఆఖరి రోజైన బుధవారం పెద్ద ముఠా కార్మికులు సంప్రదాయం ప్రకారం పొట్టేళ్ల పూల ప్రభ బండిని అమ్మవారికి సమర్పించి ఆఖరి మొక్కు చెల్లించారు. డప్పు వాయిద్యాల జోరు, బాణసంచా వెలుగులు, డీజే మోతలతో పట్టణం మారుమోగింది. చివరి సారిగా అమ్మను దర్శించు కునేందుకు భక్తులు పోటెత్తారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి అమ్మవారిని దర్శించుకున్నారు. మాఘశుద్ధ ఏకాదశి పర్వదినాన మెట్టినింటి నుంచి వేలాది మంది భక్తజన గండ దీప హారతుల నడుమ శ్రీ కనక చింతయ్య సమేతంగా బయలుదేరిన అమ్మవారు 15 రోజులు పాటు ఆలయంలో భక్తుల పూజలు అందుకున్నారు. దాదాపు పది లక్షల మందికి పైగా భక్తులు తిరునాళ్లకు వచ్చారు. చల్లని తల్లికి పాల పొంగళ్లు నైవేద్యంగా చెల్లించి, పసుపూ కుంకుమ సమర్పించారు. శిడి బండి అనంతరం జోడుపొట్టేళ్ల పూల ప్రభ బండ్లును భక్తులు అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరునాళ్ల 15 రోజులూ ఉయ్యూరుతో పాటు పరిసర గ్రామాలు అన్నీ బంధుమిత్రులతో కళకళలాడాయి.
ప్రత్యేక ఆకర్షణగా ప్రభ బండి ఊరేగింపు
తిరునాళ్లు ఆఖరి రోజు పెద్ద ముఠా కార్మికుల ప్రభ బండి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఠా ఏర్పడిన నాటి నుంచి అమ్మవారికి ఊరేగింపుగా తరలివెళ్లి జోడు పొట్టేళ్ల పూల ప్రభ బండిని సమర్పించటం సంప్రదాయంగా వస్తోంది. ఈ సంప్రదాయన్నే కొనసాగిస్తూ ముఠా కార్మికులు బుధవారం శ్రీ వెంకటేశ్వరస్వామి, శివలింగాల ఆకృతిలో పూలు, పండ్లుతో ప్రత్యేకంగా ప్రభ బండిని తయారు చేయించి పొట్టేళ్లతో భారీగా ఊరేగింపుగా తరలివెళ్లి అమ్మవారిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు.
మెట్టినింటికి చేరుకోనున్న అమ్మవారు
ఆలయంలో పూజలందుకున్న అమ్మవారు గురువారం ఉదయం శ్రీకనక చింతయ్య సమేతంగా మెట్టినింటికి బయలుదేరుతారు. అర్ధరాత్రి ఒంటి గంట దాటాక ప్రధాన ఆలయంలో అమ్మవారిని పారుపూడి, నెరుసు వంశస్తులు ప్రత్యేక పూజలు చేసి ఆలయం వెలుపలకు చేర్చుతారు. పల్లకిలో ఊరేగింపుగా ఊయల స్తంభాల వద్ద ఊయల ఊపి రావిచెట్టు రోడ్డు మీదుగా మెట్టినింటికి చేరుస్తారు. అమ్మవారి తిరునాళ్ల అన్ని రోజులూ ఉయ్యూరు పట్టణంలో వివాహాది శుభకార్యాలకు అవసరమైన పనులు చేపట్టడం, పసుపు కొట్టడం అనేవి ఉండవు. ఉత్సవం పూర్తికావటంతో వివాహ శుభకార్యాలకు పట్టణ వాసులు శ్రీకారం చుట్టనున్నారు.
వైభవంగా ముగిసిన వీరమ్మతల్లి తిరునాళ్ల


