సద్గుణరాశి.. సదా సన్నుతి
రెండో రోజు కిక్కిరిసిన గుణదల కొండ ప్రత్యేక ప్రార్థనలు, మొక్కుబడులు చెల్లిస్తున్న భక్తులు సమష్టి దివ్యబలిపూజ చేసి సత్ప్రసాదాలను అందించిన గురువులు
క్రీస్తు ద్వారానే రక్షణ..
దయాప్రాప్తురాలి చెంత.. భక్తజన కెరటం
విశ్వాస శిఖరం ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతోంది. వేలాదిగా తరలివస్తున్న భక్తజనం మదిమదిలో సద్గుణరాశి మరియమాతను నింపుకొని మనసారా ప్రణమిల్లుతోంది. మొక్కుబడులు చెల్లిస్తూ.. ప్రార్థనల్లో పాల్గొంటూ.. దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరిస్తూ దీవెనలు పొందుకుంటోంది. మేరీమాత తిరునాళ్ల రెండో రోజు మంగళవారం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో గుణదల పుణ్య క్షేత్రం కిక్కిరిసింది. ఉత్సాహపరిచే పాటలు.. మనోనేత్రాన్ని వెలిగించే ప్రసంగాలు.. గురువుల సమష్టి దివ్యపూజాబలి, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను తన్మయత్వానికి గురిచేస్తున్నాయి.
గుణదల(విజయవాడ తూర్పు): విశ్వ జననిగా కీర్తినొందిన మరియతల్లిని గౌరవిస్తూ.. ఆమె కుమారుడైన ఏసుక్రీస్తు మార్గాన్ని మనమంతా అనుసరించాలని నెల్లూరు కథోలిక పీఠాధిపతి పిల్లి ఆంథోని దాస్ అన్నారు. గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో రెండో రోజు మంగళవారం ఉత్సవాలు ఘనంగా కొనసాగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన ఆంథోని దాస్ భక్తులకు దైవ సందేశాన్ని అందించారు. మానవాళికి మరియమాత ఆదర్శంగా నిలుస్తోందన్నారు. దేవాది దేవునికి సంపూర్ణమైన శిష్యురాలిగా ఆమె జీవించిందన్నారు. లోక రక్షకుడైన క్రీస్తును, ఆయన కట్టడలను అనుసరిస్తూ మానవులంతా పరిపూర్ణమైన ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగించాలని కోరారు. తన ప్రియ కుమారుడు శిలువ మరణం పొందుతున్నా ఆమె ఎంతగానో సహించి.. తన జీవితాన్ని దేవునికి అప్పగించిందని వివరించారు. మరియతల్లిని ఆదర్శంగా తీసుకుంటూ దేవుడిపై విశ్వాసముంచుతూ మానవులంతా భక్తిమార్గంలో నడుచుకోవాలన్నారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై విజయవాడ కథోలిక పీఠం బిషప్ తెలగతోటి రాజారావు, మోన్సిగ్నోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ యేలేటి విలయం జయరాజు, తదితర గురువులతో కలసి సమష్టి దివ్య బలి పూజ సమర్పించా రు. భక్తులకు సత్ప్రసాదాన్ని అందజేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
కిటకిటలాడిన పుణ్యక్షేత్రం..
మేరీమాత తిరునాళ్లకు రాష్ట్ర నలుమూలల నుంచి యాత్రికులు లక్షలాదిగా పుణ్యక్షేత్రానికి చేరుకుంటున్నారు. దీంతో గుణదల కొండపై భక్తులు కిటకిటలాడారు. కొండపై కాలిబాటలు, మెట్ల మార్గాలు యాత్రికులతో నిండిపోయాయి. మరియమాతను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అమ్మా వందనం.. మరియతల్లీ వందనం అంటూ శరణు వేడారు. కొబ్బరి కాయలు కొడుతూ, తలనీలాలు సమర్పిస్తూ తమ మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. అటుపై కొండ శిఖరాగ్రం వరకు వెళ్లి భక్తులు క్రీస్తు శిలువ వద్దకు చేరుకుని ప్రార్థించారు.
దేదీప్యంగా గుణదల కొండ..
ఉత్సవాల సందర్భంగా విద్యుత్ దీప కాంతులతో గుణదల కొండంతా కాంతులీనుతోంది. పుణ్యక్షేత్ర ప్రధానాలయం దగ్గర నుంచి మెట్ల మార్గాలు, మేరీమాత స్వరూపం అటుపై కొండ శిఖరాగ్ర వరకు ధగధగ మెరుస్తోంది. పగటి వెలుగును ప్రతిబింబిస్తూ పుణ్యక్షేత్రం అలరారుతోంది.
సాయంత్రం సమయంలో జరిగిన సమష్టి దివ్యబలి పూజ కార్యక్రమానికి విశాఖపట్నం అగ్రపీఠాధిపతి ఉడుముల బాల ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన భక్తులనుద్దేశించి మాట్లాడుతూ మరియమాత పరమ పునీతురాలిగా కీర్తినొందుతోందన్నారు. లోక రక్షకుడైన క్రీస్తును విశ్వసించి ఆయనను అనుసరించిన భక్తులకు రక్షణ మార్గం చేకూరుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాలను పెంపొందించుకోవాలని, దైవ చింతన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు.
సద్గుణరాశి.. సదా సన్నుతి
సద్గుణరాశి.. సదా సన్నుతి


