అవాస్తవాలతో డైవర్షన్ పాలిటిక్స్
లబ్బీపేట(విజయవాడతూర్పు): ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని నిందలు మోపారని.. ఇప్పుడు వాస్తవాలు బయటకు తెలుస్తుండటంతో డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. విజయవాడలోని జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అవినాష్ మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమంపై శ్రద్ధ లేదన్నారు.
పవన్కల్యాణ్ బహిరంగ క్షమాపణలు చెప్పాలి
చంద్రబాబు చెప్పిన అబద్ధాన్ని నిజం చేయటానికి దుర్గగుడి మెట్లు కడిగిన పవన్ కల్యాణ్ నటించారన్నారు. ఇప్పుడు వాస్తవాలు బయటకు వచ్చిన నేపథ్యంలో పవన్కల్యాణ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని అవినాష్ డిమాండ్ చేశారు. కల్తీ జరిగిందని చెప్పిన ట్యాంకర్లు అన్నీ తనిఖీ చేసి, పంపించింది కూటమి ప్రభుత్వమేనన్నారు. ఈ విషయం లో వైఎస్సార్ సీపీకి సంబంధం ఏమి ఉందో చెప్పాలన్నారు.
సుప్రీం కోర్టు చీవాట్లు పెట్టినా...
తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందనే విషయంలో సుప్రీం కోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టిందని అవినాష్ చెప్పారు. ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారని, హిందువులకు అండగా ఉండేది వైఎస్ జగన్ మాత్రమే అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై అపనమ్మకం తీసుకొచ్చింది చంద్రబాబేనని, 2014–19 మధ్య వందలాది హిందూ గుడులు కూల్చింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చంద్రబాబు చిందులు వేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడులు చేసే విష సంస్కృతి ప్రారంభించింది చంద్రబాబేనన్నారు.


