సహజ కవిత్వం, మాటపాటలతో తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిన అందెశ్రీకి మరణం లేదని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (TDF) కెనడా అభిప్రాయపడింది. టొరెంటోలో స్థిరపడిన తెలంగాణ వాసులు అందెశ్రీ సంస్మరణ సభను నిర్వహించారు. స్థానిక తెలంగాణ వాసులు పెద్ద సంఖ్యలో హాజరై అందెశ్రీకి నివాళులు అర్పించారు.
ఉద్యమానికి ముందూ, తర్వాత కూడా తెలంగాణ ఆత్మలా అందెశ్రీ (Ande Sri) నిలిచారని కొనియాడారు. రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ భావజాల వ్యాప్తిలో ఆయన చేసిన సేవలు అనిర్వచనీయం అన్నారు. వివిధ దేశాల్లో స్థిరపడిన తెలంగాణ వాసులను కలుసుకొని తన మాట, పాటలతో జనాన్ని జాగృతం చేశారని అన్నారు. 2014లో కెనడాలో పర్యటించిన ఆయన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. అందెశ్రీ కుటుంబాన్ని ఆదుకోవటంతోపాటు, ఆయన ఇంటి నిర్మాణం పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని కెనడా ఎన్.ఆర్.ఐలు (Canada NRIs) కోరారు.
అలాగే అందెశ్రీ రచనలు, కవితలు, పాటలు డిజిటలైజేషన్ చేసి భవిష్యత్ తరాలకు అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ జితేందర్ రెడ్డి గార్లపాటి, జనరల్ సెక్రటరీ వెంకట్ రెడ్డి పోలు, సురేందర్ పెద్ది, శ్రీకాంత్ నెరవెట్ల, కృష్ణారెడ్డి చాడ, రవీందర్, అమిత పినకేసి, సుమన్ ముప్పిడి, మహేందర్ రెడ్డి, రవీందర్ కొండం, అర్షద్, ఇతర టీడీఎఫ్ సభ్యులు పాల్గొన్నారు.

చదవండి: 17 ఏళ్ల తర్వాత ఇండియాకు ఎన్నారై జంట


