ధర్పల్లి: పంటలను కాపాడడమే ప్రజా ప్రభుత్వ ప్ర ధాన లక్ష్యమని, రైతులు ప్రతి నీటి బొట్టునూ పొదు పుగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. మండలంలోని రామడుగు ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాల్వల ద్వారా ఎమ్మెల్యే శనివారం సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగునీటి విడుదలపై ఆంక్షలు ఉన్నప్పటికీ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డితో కలిసి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో ప్రత్యేకంగా చర్చించామని, రామడుగు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసేందుకు అనుమతులు పొందామని అన్నా రు. చివరి ఆయకట్టు వరకు నీరు చేరేలా అధికారు లు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. భవిష్యత్లో కరువు పరిస్థితులు ఎదురయ్యే అవకా శం ఉన్నందున ప్రతి నీటి బొట్టునూ జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. పంటలను కాపాడేందుకు భారీ స్థాయిలో విద్యుత్ కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నామని అన్నారు. విద్యుత్ సరఫరాపై ప్రతిపక్షాలు గాలి మాటలు మాట్లాడుతున్నాయని, రైతులు వాస్తవ పరిస్థితులను గమనించాలని సూచించారు. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దెబ్బతీసిన బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దళిత స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా బీఆర్ఎస్ నీచ రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరేశ్, నాయకులు ఆర్మూర్ బాలరాజ్, మహేందర్, ఆనంద్, మనోహర్రెడ్డి, సాయారెడ్డి, సర్పంచులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.


