డొంకేశ్వర్(ఆర్మూర్): ఖరీఫ్ సీజన్లో రైతులు ఆశ తో సాగు చేసిన మొక్కజొన్న (మక్క) పంట ప్రస్తు తం కోత దశకు చేరుకుంది. అందరికన్నా ముందుగా సాగు చేసిన ప్రాంతాల్లో పంట కోతలు కూడా మొదలయ్యాయి. అయితే, పంట చేతికొచ్చి రైతు లు విక్రయానికి సిద్ధమవుతున్నా, ప్రభుత్వ కొనుగోళ్లకు సంబంధించి కసరత్తు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. కనీసం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై మార్క్ఫెడ్ అధికారులు ఇప్పటి వరకు ప్రతిపాదనలు, ప్రణాళికలు సిద్ధం చేయలేదు. మక్కలకు మద్దతు ధర క్వింటాలుకు రూ.2,400 ఉండటంతో రైతులు జిల్లా వ్యాప్తంగా 54,601 ఎకరాల్లో సాగు చేశారు. 1.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశముంది. అయితే, గతేడాది జిల్లాలో 14 మండలాల్లో 27 కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేశారు. అది కూడా సగం పంటను వ్యాపారులకు విక్రయించిన తర్వాత ఏర్పాటు చేయడంతో రైతులు నష్టపోయారు. ఈ ఏడాది కూడా కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వం ఆలస్యం చేస్తే, అదను చూసి దళారులు రంగప్రవేశం చేసే అవకాశాలున్నాయి. అదే జరిగితే, రైతుల అత్యవసరాన్ని ఆసరాగా చేసుకొని వ్యాపారులు తక్కువ ధరకే పంటను కొనుగోలు చేసే పరిస్థితి ఉంటుంది.
కొనుగోళ్లపై కనిపించని కసరత్తు
ప్రణాళికలు సిద్ధం చేయని మార్క్ఫెడ్ అధికారులు
గతేడాది మాదిరిగా ఆలస్యమైతే
దళారుల దోపిడీ తప్పదంటున్న
రైతాంగం


