● అనారోగ్య సమస్యలతో బలవన్మరణం
భిక్కనూరు: ఉపాధ్యాయ దినోత్సవం రోజే ఉపాధ్యాయుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని కల్కినగర్కు చెందిన లింబాద్రి(51) భిక్కనూరు మండలం జంగంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు. 30 యేళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నాడు. 2018 నుంచి జంగంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇన్చార్జి హెచ్ఎంగా పలుమార్లు పనిచేశాడు. రెండేళ్ల క్రితం ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్న లింబాద్రి కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. శనివారం వేకువజామున అనారోగ్య సమస్య తట్టుకోలేక ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు కంటతడిపెట్టారు. లింబాద్రికి భార్య పద్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు.


