ఆర్మూర్: దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన సహాయ పరికరాలు (ఉపకరణాలు) అందించేందుకు గుర్తింపు శిబిరాలను తెలంగాణ సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఇందుకోసం సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దివ్యాంగుల సౌకర్యార్థం రెవెన్యూ డివిజన్ల వారీగా 7వ తేదీన ఆర్మూర్లో, 8న బోధన్, 9న నిజామాబాద్ నగరంలో శిబిరాల నిర్వహణకు ఉన్నతాధికారులు అనుమతించారు. శారీరక, మానసిక వైకల్యం, వినికిడిలోపం, అంధత్వంతో బాధపడుతున్న పిల్లలకు అవసరమైన వీల్ చైర్స్, చంక కర్రలు, ట్రై సైకిళ్లు, రొలేటర్స్, హియరింగ్ ఎయిడ్స్, బ్రెయిలీ కిట్, బ్రెయిలీ ప్లేట్స్, బ్రెయిలీ కిట్, ఎమ్మార్ కిట్లతోపాటు కృత్రిమ అవయవాలు అందించడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (అలిమ్కో) సహకారంతో శిబిరాలను నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 4,125 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో వివిధ కేటగిరీల్లో పరికరాలు అవసరం ఉన్న వారిని ఇన్క్లూసీవ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ (ఐఈఆర్పీ)లు గుర్తించారు. పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. వారిని శిబిరాలకు తరలించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
శిబిరాలకు హాజరయ్యే విద్యార్థులు ఇన్కం, సదరం సర్టిఫికెట్లు, యూడీఐడీ కార్డు, తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్లతోపాటు మూడు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు వెంట తీసుకెళ్లాలి. సదరం సర్టిఫికెట్ లేని వారు సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యునితో ధ్రువీకరించిన పత్రంపై ఎంఈవో లేదా ప్రధానోపాధ్యాయుడి అటెస్టేషన్ చేయించుకొని వెళ్లాలి. 60 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులు, 40 శాతం సహిత విద్యా విభాగం నిధులు వెచ్చించి పరికరాలను అందిస్తారు.
గతేడాది తీసుకున్న వారు అనర్హులు
గతేడాది సహాయ ఉపకరణాలు తీసుకున్న దివ్యాంగు లు ప్రస్తుతం అనర్హులు. కొ త్తగా అవసరం ఉన్న వారు మాత్రమే క్యాంపునకు రావాలి. గుర్తించిన వారికి పరికరాలను అతి త్వరలో ఉచితంగా అందజేస్తాం.
– పడకంటి శ్రీనివాస్రావు,
సహిత విద్యావిభాగం జిల్లా ఇన్చార్జి కో ఆర్డినేటర్
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రమే..
ప్రభుత్వ పాఠశాలల్లో చది వే దివ్యాంగ విద్యార్థుల కోసం మాత్రమే నిర్వహించే శిబిరాలను సద్వినియో గం చేసుకోవాలి. వైకల్యంతో బాధపడుతున్న పిల్లలకు పరికరాలు ఎంతగానో ఉపయోగపడతాయి.
– అశోక్, డీఈవో, నిజామాబాద్
ఉపకరణాలు అందించేందుకు ఎంపిక కోసం ప్రత్యేక శిబిరాలు
7న ఆర్మూర్, 8న బోధన్,
9న జిల్లా కేంద్రంలో..
నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్న
అలిమ్కో ప్రతినిధులు


