నిజామాబాద్ రూరల్: ‘‘ప్రకృతిని రక్షిస్తానంటూ ప్రమాణం చేస్తూ.. భూమాతకు లేఖ రాయండి’’ నగదు బహుమతులు అందుకోండి అంటోంది తపాలా శాఖ. విషయమం ఏమిటంటే.. లేఖలు రాసే అలవాటును ప్రోత్సహిస్తూనే సృజనాత్మకతను వెలికి తీసేందుకు తపాలాశాఖ ప్రతి ఏడాది ‘ఢాయ్ అఖర్’ లేఖల పోటీని నిర్వహిస్తోంది. ఈ ఏడాదిసైతం 18 ఏళ్లలోపు, 18 ఏళ్లు దాటిని వారికి రెండు కేటగిరీల్లో (ఒక్కో కేటగిరీలో ఇన్లాండ్, ఎన్వలప్ విభాగాలు) పోస్టల్ డిపార్ట్మెంట్ పోటీలు నిర్వహిస్తోందని నిజామాబాద్ తపాలాశాఖ సీనియర్ సూపరింటెండెంట్ కే జనార్దన్రెడ్డి శుక్రవారం తెలిపారు. ‘భూమాతకు లేఖ.. ప్రకృతిని రక్షిస్తానని నా ప్రమాణం’ (A Letter to Mother Earth: My Promise to Protect Nature) అనే అంశంపై ఇన్లాండ్ లెటర్లో 500 పదాలు, ఎన్వలప్ ఏ4 సైజ్ పేపర్పై వెయ్యి పదాలకు మించకుండా హిందీ, ఇంగ్లిష్, ఏదైనా వాడుక భాషలో లేఖ రాయాలని సూచించారు. లెటర్లను The chief postmaster general, Telangana circleకు అక్టోబర్ 31వ తేదీలోగా పంపించాలని.. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను నాలుగు విభాగాల్లో విజేతలకు సర్కిల్, జాతీయస్థాయిలో బహుమతులు అందిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు, యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
తపాలా రాత పూర్వక పోటీలు
సృజనాత్మకతను వెలికి తీస్తూ..
లేఖలు రాసే అలవాటుకు ప్రోత్సాహం
లేఖలు పంపేందుకు
అక్టోబర్ 31 వరకు అవకాశం


