ఈ ఫొటోలోని వ్యక్తి పేరు చింతకుంట పెద్దసాయన్న. మోపాల్ మండలం మంచిప్ప గ్రామానికి చెందిన సాయన్నకు 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ధరణి పోర్టల్లో రెండు ఎకరాల భూమి వేరే వారి పేరిట నమోదైంది. తన పేరిట నమోదు కోసం పదేళ్లుగా ఎదురు చూస్తున్నా ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదు. ఏళ్లుగా తానే సాగులో ఉంటున్నా ఆన్లైన్లో లేకపోవడంతో రైతుభరోసాతోపాటు ధాన్యం విక్రయం, యూరియా కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, ఇప్పటికే పదుల సార్లు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పని కావడం లేదని ఆవేదన చెందుతున్నాడు.
డొంకేశ్వర్ మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ఇది. మండల స్థాయిలో సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన కార్యక్రమానికి మెజార్టీ శాఖల అధికారులు హాజరుకాలేదు. రోడ్లు భవనాలు, ఇరిగేషన్, పశుసంవర్ధక, ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ, అటవీ, ఫైర్ తదితర శాఖల అధికారుల హాజరు కరువైంది. ప్రజల సమస్యలను నివేదించే కీలక కార్యక్రమానికి అధికారుల హాజరుకాకపోతే సమస్యలు ఎలా పరిష్కారమవుతాయనే ప్రశ్న తలెత్తుతోంది.


