నిజామాబాద్ రూరల్: ఉపాధి, మెరుగైన భవిష్యత్ కోసం తెలంగాణ నుంచి విదేశాలకు వెళ్తున్న యువత, వలసకార్మికుల సంక్షేమం కోసం పటిష్టమైన విధానాన్ని రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా విదేశీ వలస కార్మికుల సంక్షేమ విధానాలను అధ్యయనం చేయడానికి తెలంగాణ ఎన్ఆర్ఐ సలహా కమిటీ ప్రతినిధి బృందం ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు ఫిలిప్పీన్స్లోని మనీలాలో పర్యటించనుంది. కమిటీలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి ఉన్నారు. ఫిలిప్పీన్స్ అనుసరిస్తున్న విదేశీ కార్మిక విధానాలు, భద్రత, చట్టపరమైన రక్షణ పద్ధతులను కమిటీ పరిశీలించనుంది. అలాగే స్వదేశానికి తిరిగి వచ్చే వలస కార్మికులకు పునరావాసం, వారి సంక్షేమానికి చేపడుతున్న చర్యలను కమిటీ తెలుసుకోనుంది. అలాగే వలస కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు కోసం అవసరమైన సలహాలు, సూచనలను స్వీకరించనుంది.


