వేల్పూర్ (మెండోరా): శ్రీరాంసాగర్ ప్రాజెక్టుపై ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. సెలవురోజు కావడంతో జిల్లావాసులే కాకుండా ఇత ర ప్రాంతాల నుంచి ప్రజలు ప్రాజెక్టును చూడడానికి వచ్చారు. ప్రాజెక్టు అందాలను చూస్తూ సేదతీరారు. చిన్నపిల్లలు గుర్రపుస్వారీని ఆస్వాదించారు. పర్యాటకులు డ్యాం గేట్ల వైపు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
తగ్గిన ఇన్ఫ్లో..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో భారీగా తగ్గిపోయింది. వర్షాలు లేకపోవడంతో తగ్గిపోయిన ఇన్ఫ్లో అవుట్ఫ్లోతో సమానంగా ఉంటోంది.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలు కాగా, ఆదివారం నాటికి నీటిమట్టం 43.967 టీఎంసీలు ఉంది. కాకతీయ కాలువకు 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు వెళుతుండగా, ఆవిరిరూపంలో 482 క్యూసెక్కులు వెళుతోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.


