● ఆదర్శంగా నిలుస్తున్న కొత్తపల్లికి
చెందిన యువరైతు
● 30 గుంటల భూమిలో పండ్లు,
కూరగాయల సాగు
మాచారెడ్డి: ఉన్న ఆ కొద్ది భూమిలో సేంద్రియ ఎరువులతో రూ. లక్షల దిగుబడిని సాధిస్తూ, ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓయువరైతు. మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి అనే యువరైతు రసాయన ఎరువులకు స్వస్తి చెప్పి గత ఐదేళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తుండగా రెండేళ్లుగా దిగుబడి వస్తోందన్నారు. ఈసందర్భంగా ఆయన ‘సాక్షి’తో పలు విషయాలను వెల్లడించాడు. 30 గుంటల్లో డ్రాగన్, గ్యాక్, జామ, వాటర్ ఆపిల్, మామిడి పండ్ల రకాలతోపాటు కొబ్బరి పంటను కూడా సాగు చేస్తున్నట్లు వివరించారు. అలాగే వివిధ రకాల కూరగాయలు కూడా సాగు చేస్తున్నట్లు పేర్కొన్నాడు. మరో ఐదు గుంటల్లో ఫాంపాండ్ను ఏర్పాటు చేసి చేపలు పెంచుతున్నట్లు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన రైతులు తన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి సేంద్రియ వ్యవసాయంలోని మెళకువలను తెలుసుకుంటున్నారన్నారు. సేంద్రియ ఎరువులతో సాగు చేసిన పంటలకు చీడపీడలు ఆశించవని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చన్నారు.


