జ్వరంతో చిన్నారి మృతి
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలో ఓ చిన్నారి జ్వరంతో మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరా లు ఇలా.. మద్నూర్కు చెందిన వంగపల్లి యోగేశ్– వైష్ణవి దంపతులకు కుమారుడు, కూతురు అద్విక(5) ఉన్నారు.అద్విక ప్రస్తుతం ఎల్కేజీ చదువుతోంది. శనివారం సాయంత్రం ఆమెకు జ్వరం రావడంతో కుటుంబసభ్యులు స్థానిక మెడికల్లో జ్వరం మందు తీసుకువచ్చి, పోశారు. ఆదివారం ఉదయం చిన్నారి ఆటలు ఆడగా, మధ్యాహ్నం నీరసంతో పడుకుంది. కొంతసేపటికి చిన్నారిని పిలిచినా లేవకపోవడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యు లు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు దద్దరిల్లిపోయాయి. గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.
అనారోగ్యంతో ఒకరు ..
రుద్రూర్: అనారోగ్యానికి గురై చికిత్స నిమిత్తం ఆస్పతికి తరలిస్తుండగా ఓ వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు కోటగిరి ఎస్పై శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. వివరాలు ఇలా.. పోతంగల్ మండలంలోని టాక్లి గ్రామానికి చెందిన జీవన్ పటేల్(48) అనే వ్యక్తి నెల రోజుల క్రితం ప్రత్యర్థులు జరిపిన దాడిలో గాయపడ్డాడు. చికిత్స అనంతరం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఆకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు అతడిని బోధన్కు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.మరణానికి గల అసలు కారణం తెలుసుకునేందుకు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
సిరికొండ: మండలంలోని పాకాల గ్రామంలోగల జగదాంబ దేవి ఆలయంలో చోరీ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆలయ పూజారి సేవాలాల్ ఆదివారం ఉదయం ఆలయాన్ని తెరవగా అమ్మవారి మెడలోని బంగారు పుస్తెలు చోరీకి గురైనట్లు గుర్తించి, గ్రామస్తులకు తెలిపారన్నారు. చోరీ విషయం సిరికొండ పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి పరిశీలించారని గ్రామస్తులు తెలిపారు.


