నిజామాబాద్ రూరల్: చరిత్రలో జరిగిన వాస్తవాలను ప్రస్తుత కాలంలో జరుగుతున్న నిజాలను లిఖించకపోతే అసత్యాలే చరిత్రగా మిగిలిపోతాయని ఇతిహాస సంకలన సమితి అఖిల భారతీయ సహ సంఘటన కార్యదర్శి సంజయ్ కుమార్ మిశ్రా అన్నారు. అందుకే వాస్తవాలతో కూడిన చరిత్రను ఆధారాలతో సహా రాసి భవిష్యత్తు తరాలకు అందించాలనే ఏకై క లక్ష్యంతో సంస్థ పనిచేస్తున్నట్లు వివరించారు. రెంజల్ మండల కందకుర్తి గ్రామంలోని డాక్టర్ హెడ్గేవార్ స్మృతి మందిర సందర్శన కోసం ఆదివారం ఆయన జిల్లా కేంద్రానికి విచ్చేశారు. నగరంలోని ఇతిహాస సంకలన సమితి కార్యాలయంలో నిర్వహించిన ఇందూరు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మట్లాడారు. ఇతిహాస సంకలన సమితి సంస్థగతంగా మరింత బలోపేతం కావాలన్నారు. సంస్థ ప్రతినిధులు మోహన్ దాస్, శైలి బెల్లాల్, కందకుర్తి ఆనంద్, భోగరాజు వేణుగోపాల్, చంద్రశేఖర శర్మ, రిషి, నవీన్, వెంకట మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ అర్బన్: నగరంలో ఆదివారం జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్–17 జిల్లాస్థాయి ఎంపిక టోర్నమెంట్ నిర్వహించగా, పలువురు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. బాలుర విభాగంలో సాయిసామల చెస్ అకాడమీ విద్యార్థి రిష్విక్ బొర్రొల్ల ప్రథమ స్థానం సాధించారు. అదే అకాడమీకి చెందిన గౌరంగ అశోక్ ద్వితీయ స్థానం సాధించాడు. బాలికల విభాగంలో నలంద పాఠశాలకు చెందిన హర్షిత, అభ్యాస పాఠశాలకు చెందిన అభిగ్న ఎంపికయ్యారు. విజేతలకు చెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమేశ్ బహుమతులు అందజేశారు.


