నిజామాబాద్ రూరల్ : మూతపడిన నిజాం కో ఆపరేటీవ్ షుగర్ ఫ్యాక్టరీ (సారంగాపూర్)ని పునః ప్రారంభించి రైతు ప్రయోజనాలను కాపాడే విధంగా ప్రభుత్వమే నిర్వహించాలని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్సీఎస్ఎఫ్ ఆవరణలో సంఘం ఆధ్వర్యంలో గురువారం ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాపయ్య మాట్లాడుతూ.. సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీ ఈ ప్రాంతంలోని వేలాది మంది రైతులు, కార్మికులకు దశాబ్దాలపాటు జీవనాధారంగా నిలిచిందన్నారు. ఫ్యాక్టరీని మూసివేయడంతో రైతులు, కార్మికులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ మూతపడిన తర్వాత చెరకు సాగు తగ్గిపోయిందని, రైతులు ఇతర పంటలసాగు వైపు మళ్లారన్నారు. ఎన్సీఎస్ఎఫ్ను బెల్లం ఫ్యాక్టరీగా మార్చి ప్రభుత్వమే నడపాలని కోరారు. ఫ్యాక్టరీని తెరవాలని కోరుతూ మూడు తీర్మానాలు చేసి ఎండీ రవికి అందజేశారు. చెరుకు ఉత్పత్తిదారుల సంఘం నాయకులు ఆర్ పృథ్విరాజ్, పాల్దా రాజారెడ్డి, బి లక్ష్మారెడ్డి, వై సంతోష్, టేక్మల్ లక్ష్మణ్, కొట్టే గంగాధర్, సిర్ప నాగయ్య, బి సాయిలు, ఎర్రన్న, అర్సపల్లి గోపాల్, రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
బెల్లం కేంద్రంగా మార్చి
ప్రభుత్వమే నడపాలి
చెరుకు ఉత్పత్తిదారుల సంఘం
జిల్లా కన్వీనర్ ఆకుల పాపయ్య


