● భారీ గుంతలతో
వాహనదారులకు అవస్థలు
● పట్టించుకోని అధికార యంత్రాంగం
సిరికొండ: మండలంలోని కొండాపూర్ నుంచి ముషీర్నగర్ మీదుగా జిల్లా కేంద్రం వైపు వెళ్లే రోడ్డు అత్యంత అధ్వానంగా మారింది. బీటీ రోడ్డుపై తారు, కంకర లేచిపోయి పెద్ద పెద్ద గుంతలతో దర్శనమిస్తోంది. ఈ గుంతల రోడ్డుతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొండాపూర్ వడ్డెర కాలనీ నుంచి గడ్డమీది తండా, మెట్టుమర్రి తండా, ముషీర్నగర్ మీదుగా కార్నర్ తండా వరకు ఐదు కిలోమీటర్లకు పైగా గల ఈ రోడ్డులో అడుగు అడుగు ఒక గుంత దర్శనమిస్తోంది. గుంతలమయంగా మారిన ఈ మార్గంలో ప్రయాణికుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. గుంతల్లో వాన నీళ్లు నిలిచి రోడ్డు చెరువును తలపిస్తున్నాయి. ఈ రోడ్డు మీదుగా ప్రయాణం నరకం కనిపిస్తుందని వాహనదారులు వాపోతున్నారు. గుంతలు అడుగు లోతు కంటే ఎక్కువగా ఉండటంతో భారీ వాహనాలతో పాటు కార్లు, వ్యాన్లు లాంటి వాహనాల అడుగు భాగం నేలకు తగులుతున్నాయని ప్రయాణికులు పేర్కొంటున్నారు. వాహనాల అడుగు భాగం నేలకు తగిలి వాహనాలు చెడిపోతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాకాల, గోప్యనాయక్ తండా, వర్జన్ తండా, తూంపల్లి, గోప్య తండా, సర్పంచ్ తండా, కొండాపూర్ గ్రామాల ప్రజలతో పాటు మరో ఐదారు తండాలకు చెందిన ప్రజలు జిల్లా కేంద్రం వైపు ఈ మార్గంలోనే నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడిన కనీస మరమ్మతులు చేయకపోవడం పట్ల సంబంధిత అధికారుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంతల్లో కంకర నింపి మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.


