● అనారోగ్యంతో మృతి చెందిన సహచర మిత్రుడి కుటుంబానికి అండ
● రూ. 4.54 లక్షలుఆర్థికసాయం
ఆర్మూర్: ఉపాధి కోసం ఇజ్రాయిల్ దేశం వెళ్లి అక్కడ ఒక యూనిటీగా ఏర్పడిన ఇజ్రాయిల్ తెలంగాణ అసోసియేషన్ సభ్యులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన తమ సహచర మిత్రుడు వడ్ల సందీప్ కుటుంబానికి అండగా నిలిచారు. వివరాలను అసోసియేషన్ అధ్యక్షుడు బానాల గంగాధర్, కోశాధికారి తిమ్మాపూర్ శ్రీనివాస్ గౌడ్ గురువారం తెలిపారు. మాక్లూర్ మండలం వల్లభాపూర్ గ్రామానికి చెందిన సందీప్ రెండేళ్ల క్రితం ఉపాధి కోసం ఇజ్రాయిల్కు వచ్చాడు. అక్కడే అనారోగ్యం పాలవడంతో ఇజ్రాయిల్ తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధుల సహకారంతో ఫిబ్రవరి 27న దుబాయి మీదుగా హైదరాబాద్కు చేరుకున్నాడు. హైదరాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జూన్ 3వ తేదీన మరణించాడు. దీంతో ఇజ్రాయిల్ తెలంగాణ అసోసియేషన్ సభ్యులు సందీప్ కుటుంబానికి అండగా నిలవాలనే సంకల్పంతో రూ. 4లక్షల54 వేలు విరాళాలను సేకరించారు. సందీప్ కుమారులిద్దరి పేరిట చెరి రెండు లక్షల రూపాయలు తొమ్మిదేళ్ల కోసం డిపాజిట్ చేయించారు. మిగిలిన రూ. 54 వేల నగదును మృతుడి భార్య సౌందర్యకు అందజేశారు.


