డిచ్పల్లి: పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని డిచ్పల్లి ఖిల్లా గ్రామ సర్పంచ్ లొక్కిడి యాదగిరి పేర్కొన్నారు. బుధవారం జీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణ కాలుష్యం పెరగడంతో పాటు డ్రైనేజీలు మూసుకుపోయి మురుగు నీటి సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. పశువులు ప్లాస్టిక్ వ్యర్థాలను తినడం వల్ల వాటి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకు బదులుగా గుడ్డ సంచులు, కాగితపు సంచులను వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఉప సర్పంచ్ దోర్నాల సౌజన్య, వార్డు మెంబర్లు రాణి, దేవదాస్, పంచాయతీ కార్యదర్శి అజయ్కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.


