ఖలీల్వాడి : జిల్లా కేంద్రంలోని ఐటీఐలో ఈనెల13న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఐటీఐ జిల్లా కన్వీనర్ యాదగిరి తెలిపారు. జాబ్ మేళాకు ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని, వివిధ రంగాలకు చెందిన సుమారు 20 రకాల కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటాయని అన్నారు. ఐటీఐలో వివిధ ట్రేడ్లలో ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ అసలు విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, బయోడేటా, ఇతర ధ్రువపత్రాలతో జాబ్ మేళాకు హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9948195654 నంబర్ను సంప్రదించాలన్నారు.
వేల్పూర్: మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలను జిల్లా ప్యానల్ కమిటీ సభ్యులు మంగళవారం పర్యవేక్షించారు. జిల్లా కమిటీ సభ్యులు చిన్నయ్య, గంట అశోక్, కోకిల నాగరాజు, ఇతర సబ్జెక్టుల నిపుణులు రికార్డులు, మధ్యాహ్న భోజనం, కిచెన్ను పరిశీలించారు. తరగతులు, పాఠ్యాంశాల వారిగా పరిశీలించి విద్యార్థుల పురోగతిని తెలుసుకున్నారు. విద్యార్థులు పాఠ్యాంశాలను సులభంగా ఎలా నేర్చుకోవాలో వివరించారు. స్థానిక హెచ్ఎం రాజన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బురద రోడ్డుపై వరినాట్లు
ఇందల్వాయి: మండలంలోని లింగాపురంలో నూతనంగా నిర్మించిన బ్రిడ్జి వద్ద రోడ్డుకు ఇరువైపులా గుత్తేదారు మట్టి పోసి వదిలేశాడు. దీంతో ఆ ప్రాంతమంతా కురుస్తున్న వర్షాలకు బురదమయంగా మారింది. బురద రోడ్లతో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటు స్థానిక రైతు రోడ్డుపై మంగళవారం వరినట్లు వేసి నిరసన తెలిపాడు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని స్థానిక రైతులు కోరుతున్నారు.
ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని వెల్లుట్లపేట శివారులో ఉన్న చెనింగ రాజరాజేశ్వరాలయంలో సోమవారం రాత్రి చోరీ జరిగినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి, గ్రామస్తులు చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దుండగులు హుండీలో ఉన్న నగదును దొంగిలించినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


