● ఎస్హెచ్జీలకు 259 కొనుగోలు
కేంద్రాలు కేటాయింపు
● సహకార సంఘాలతో పోటీగా
కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
మోర్తాడ్(బాల్కొండ): వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం మహిళా సంఘాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. మహిళా సంఘాల సభ్యులను ఆర్థికంగా బలోపేతం చేయడంతోపాటు వ్యాపారంలో రాణించేలా కృషి చేయాలనే సంకల్పంతో ప్ర భుత్వం అడుగులు ముందుకు వేస్తుంది. ఇందులో భాగంగానే ఈసారి జిల్లాలో 259 కొనుగోలు కేంద్రాలను మహిళా సమాఖ్యలు, సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఇప్పటికే పలుచోట్ల కొనుగోలు కేంద్రాలను ఆరంభించారు. గత సీజన్లో మహిళా సంఘాలకు సుమారు 250కి పైగా కొనుగో లు కేంద్రాలు కేటాయించారు. కానీ కేటాయింపులు ఆలస్యం కావడంతో పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో 669 కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేయనుండగా ఇందులో మహిళా సంఘాలకే 259 కేటాయించడం విశేషం. 410 కొనుగోలు కేంద్రాలు సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనసాగనున్నాయి. మహిళా సంఘాల సభ్యులు అంటే బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి, ప్రైవేటు బ్యాంకులు ఇలా పలు ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం, సక్రమంగా చెల్లించడమే కాకుండా వ్యాపారంలోనూ రాణిస్తామని వారు గొప్పగా చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణతో మహిళా సంఘాల సభ్యులకు కమీషన్ జమ అవుతుంది.
సమర్థవంతంగా నిర్వహిస్తారు
మహిళా సంఘాల సభ్యులు వరి ధాన్యం కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహిస్తారు. గతంలో ఉన్న అనుభవంతో ఈసారి కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచాం. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ కొనుగోలు కేంద్రాల నిర్వహణ ఎంతో దోహదపడుతుంది.
– సాయన్న, పీడీ, జిల్లా పేదరిక నిర్మూలన సంస్థ


