● కలెక్టర్ ఇలా త్రిపాఠి
సుభాష్నగర్: మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక, ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్ భవన్లో జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై శనివారం సమగ్ర అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అంతకుముందు రైల్వేకమాన్ నుంచి అసోసియేషన్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్, ప్రి స్క్రిప్షన్ లేకుండా మందులు వాడకూడదని, యాంటీబయాటిక్స్ను దుర్వినియోగం చేయకూడదని, మందులను బాధ్యతాయుతంగా వాడాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా గోడప్రతులు ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడు తూ డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం పకడ్బందీ చర్య లు చేపడుతుందన్నారు. ప్రజలందరూ ఇందులో భాగస్వాములైనప్పుడే సాధ్యపడుతుందని తెలిపారు. అనంతరం వ్యాసరచన, క్విజ్ పోటీల విజేతలకు కలెక్టర్ బహుమతులు ప్రదానం చేశారు. కార్య క్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీ, ఈగల్ టీ మ్ సీఐ పూర్ణచందర్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వెంకన్న, డిప్యూటీ డీఎంహెచ్వో అశ్వినీ, జిల్లా కెమిస్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు నల్ల మధుసూదన్, సుధాకర్, సాయిలు, డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు శ్రీకాంత్, శ్రీలత, ఫార్మసీ కళాశాల విద్యార్థులు, ఫార్మసిస్టులు తదితరులు పాల్గొన్నారు.


