మాక్లూర్లో 13 వేల ఎకరాలు
జక్రాన్పల్లి మండలంలో ఆరు వేల ఎకరాలకు..
ఆర్మూర్ : అర్గుల్ రాజారాం (గుత్ప) ఎత్తిపోతల పథకం పరిధి విస్తరణ పనులకు మోక్షమెన్నడో అని రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రారంభించి తొమ్మిదేళ్లు గడుస్తున్నా నిధుల కేటాయింపు లేకపోవడంతో మొదటి విడత పనులు నత్తనడకన సాగుతున్నాయి. సుమారు రూ.24 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు గత ప్రభుత్వం మొదటి విడతలో రూ.11 కోట్ల 90 లక్షలు మంజూరు చేసింది. ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని ఆర్మూర్, మాక్లూర్, జక్రాన్పల్లి మండలాల్లోని 13 గ్రామాలకు గుత్ప ఎత్తిపోతల నీటిని అందించేందుకు 2016 ఆగస్టు 16వ తేదీన ఆ నాటి మంత్రి హరీశ్రావు గుత్ప శివారులో మొదటి విడత పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. క్షేత్ర స్థాయిలో మాత్రం నాలుగేళ్ల వరకు పనులు ప్రారంభం కాలేదు. ఇప్పటి వరకు 60 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. గుత్ప చెరువు వద్ద కాలువ తవ్వకం, జక్రాన్పల్లి, అర్గుల్ శివార్లలో పైప్లైన్ పనులు పెండింగ్లో ఉన్నాయి.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా రూ.204 కోట్ల కేటాయించి గుత్ప ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయించారు. ఆర్మూర్ ప్రాంతంలోని 38,792 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అయింది. దీంతో మాక్లూర్, జక్రాన్పల్లి మండలాలకు చెందిన రైతులు తమ మండలాలకు సైతం గుత్ప ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ను మళ్లించాలని ఉద్యమం ప్రారంభించారు. ఇప్పటికే జక్రాన్పల్లి మండలంలోని బ్రాహ్మణ్పల్లి, తొర్లికొండ గ్రామాలకు గుత్ప నీరందుతోంది. మునిపల్లి శివారులోని చెరువులోకి గుత్ప ఎత్తిపోతల పథకం నీటిని మళ్లిస్తే అక్కడి నుంచి లక్ష్మాపూర్, నారాయణ్పేట్, అర్గుల్, జక్రాన్పల్లి, పడకల్, కేశ్పల్లి గ్రామాల చెరువులకు నీరందే అవకాశం ఉంటుందని రైతు నాయకులు ప్రణాళిక సిద్ధం చేశారు. అందుకు రూ.ఏడు కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వానికి విన్నవించగా 2008లో వైఎస్ రాజశేఖరరెడ్డి సానుకూలంగా స్పందించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. అయితే వైఎస్ అకాల మరణంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఈ పథకంపై ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మాక్లూర్, జక్రాన్పల్లి మండలాల పరిధిలోని 18 గ్రామాల వ్యవసాయభూములకు నీరందించే గుత్ప ఎత్తిపోతల పథకం నీరుగారి పోయింది. తెలంగాణ ఏర్పడిన తరువాత నాటి సీఎం కేసీఆర్ విస్తరణ పనులపై సానుకూలంగా స్పందించారు. పనులు కార్యరూపందాలిస్తే మూడు మండలాల పరిధిలో సుమారు 20 వేల ఎకరాల ఆయకట్టు అదనంగా స్థిరీకరణ జరిగే అవకాశం ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే పరిస్థితి మాత్రం అందుకుభిన్నంగా మారింది. పనులను పరిశీలించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పార్లమెంట్ ఎన్నికల అనంతరం విస్తరణ పనులను ప్రారంభించి పూర్తి చేస్తామని ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా ముందుకు సాగడం లేదు.
కాంట్రాక్టర్ కు బిల్లులు మంజూరు కాకపోవడంతో పనులను మధ్యలో నిలిపి వేశారు. ఇంకా 40 శాతం పనులు పూర్తి అవ్వాల్సి ఉంది.
– ప్రభాకర్, ఏఈ, ఎత్తిపోతల పథకం
పర్యవేక్షణ అధికారి
గుత్ప ఎత్తిపోతల పథకం విస్తరణతో మాక్లూర్ మండలంలోని గ్రామాల పరిధిలో ఉన్న సుమారు 13 వేల ఎకరాలకు సాగునీరందే అవకాశం ఉంది. మాక్లూర్, ముల్లంగి (బీ), బొంకన్పల్లి, మాదాపూర్, బోర్గాం(కే), మానిక్బండార్, అమ్రాద్, ముత్యంపల్లి, వడ్యాట్పల్లి, మదనన్పల్లి, దాస్నగర్, మామిడిపల్లి, చిన్నాపూర్, గుత్ప తదితర గ్రామాలు గుత్ప ఎత్తిపోతల పథకం పరిధిలోకి వస్తాయి.
జక్రాన్పల్లి మండలంలోని లక్ష్మాపూర్, నారా యణ్పేట్, అర్గుల్, జక్రాన్పల్లి, పడకల్, మునిపల్లి, కేశ్పల్లి గ్రామాల్లో ఎనిమిది పెద్ద చెరువు లు, 24 కుంటలు ఉన్నాయి. గుత్ప ఎత్తిపోతల నీరు ఈ చెరువులు, కుంటలను నింపితే భూగ ర్భ జలాలు సైతం వృద్ధి చెంది ప్రత్యక్షంగా ఆ రు వేల ఎకరాలకు, పరోక్షంగా వందల ఎకరాలకు సాగునీరందే అవకాశం ఏర్పడుతుంది.
ముందుసాగని గుత్ప ఎత్తిపోతల
విస్తరణ పనులు
పూర్తయితే ఆర్మూర్, మాక్లూర్,
జక్రాన్పల్లి మండలాల్లోని
13 గ్రామాలకు సాగునీరు
తొమ్మిదేళ్లయినా కార్యరూపం
దాల్చని రైతుల కల


